యాప్నగరం

నా దారికే అడ్డొస్తావా..? బౌలర్‌తో రాహుల్ గొడవ

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ టీమ్ తరఫున మరికొద్ది రోజుల్లో కేఎల్ రాహుల్, జేమ్స్ నీషమ్ కలిసి ఆడబోతున్నారు. కానీ.. ఈరోజు తన దారికి అడ్డొచ్చిన నీషమ్‌పై కేఎల్ రాహుల్ గొడవకి దిగాడు.

Samayam Telugu 11 Feb 2020, 2:56 pm
న్యూజిలాండ్‌తో బే ఓవల్ వేదికగా మంగళవారం జరుగుతున్న మూడో వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ సహనం కోల్పోయాడు. మ్యాచ్‌లో కివీస్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా నెట్టిన కేఎల్ రాహుల్ సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. అయితే.. బౌలర్ నీషమ్ కూడా బంతి విసిరిన తర్వాత పిచ్ నుంచి వెనక్కి అడుగులు వేసుకుంటూ రాహుల్‌కి అడ్డుగా వెళ్లాడు. దీంతో.. అతడ్ని ఢీకొట్టబోయిన రాహుల్.. ఆఖరి క్షణంలో తన దారిని మార్చుకుని సింగిల్ పూర్తి చేశాడు.
Samayam Telugu KL Rahul


బంతి విసిరిన తర్వాత పిచ్ మధ్యలో నిల్చొని ఉన్న జేమ్స్ నీషమ్ ఉద్దేశపూర్వకంగానే తన దారికి అడ్డుగా వచ్చాడని రాహుల్ ఆరోపిస్తూ అతనిపై గొడవకి దిగాడు. మధ్యలో అంపైర్ కలగజేసుకుని సర్దిచెప్పడంతో రాహుల్ వెనక్కి తగ్గాడు. కానీ.. మళ్లీ నీషమ్ తన నోటికి పని చెప్పడంతో రాహుల్ కోపంగా అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆఖరి క్షణంలో నీషమ్ పక్కకి తప్పుకోగా.. రాహుల్ తన మోచేతిని అతనికి తాకిస్తూ వెళ్లాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. కేఎల్ రాహుల్ (112: 113 బంతుల్లో 9x4, 2x6) శతకం బాదడంతో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. బౌలర్ జేమ్స్ నీషమ్ 8 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చినా.. శ్రేయాస్ అయ్యర్ (62: 63 బంతుల్లో 9x4) వికెట్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక కేఎల్ రాహుల్, జేమ్స్ నీషమ్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున కలిసి ఆడబోతున్నారు. ఇటీవల వేలంలో రూ. 50 లక్షలకి నీషమ్‌ని పంజాబ్‌ కొనుగోలు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.