యాప్నగరం

IND vs NZ Preview: భారత్, కివీస్‌ మూడో వన్డే‌.. క్రైస్ట్‌చర్చ్‌లో వర్షం కురిసే ఛాన్స్..?

IND vs NZ Preview: భారత్, న్యూజిలాండ్ సిరీస్‌కు వరుణుడు పదే పదే ఆటంకం కలిగిస్తున్నాడు. టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే సాఫీగా సాగగా.. వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మూడో వన్డే సమయంలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలవగా.. సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ చివరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.

Authored byరవి కుమార్ | Samayam Telugu 29 Nov 2022, 4:10 pm

ప్రధానాంశాలు:

  • భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం చివరి వన్డే
  • క్రైస్ట్‌చర్చ్‌లో హగ్లే ఓవల్‌లో మ్యాచ్
  • చివరి మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kane Williamson-Shikhar Dhawan
Kane Williamson-Shikhar Dhawan
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది. కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని కివీస్ జట్టు తొలి వన్డేలో విజయం సాధించగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో విజయం సాధిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేయగలుగుతుంది.
తొలి వన్డేలో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (72), శుభ్‌మన్ గిల్ (50), శ్రేయస్ అయ్యర్ (80) అర్ధ సెంచరీలతో రాణించారు. కానీ టామ్ లాథమ్ (145 నాటౌట్), కేన్ విలియమ్సన్ (94 నాటౌట్) సత్తా చాటడంతో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి వన్డే తరహాలోనే రెండో వన్డేలోనూ న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 12.5 ఓవర్లలో భారత్ 89/1తో ఉన్న దశలో వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయ్యింది. శిఖర్ ధావన్ 3 పరుగులు మాత్రమే ఔటవగా.. శుభ్‌మన్ గిల్ (45), సూర్యకుమార్ యాదవ్ (34) క్రీజ్‌లో నిలిచారు.

తొలి వన్డేలో సంజూ శాంసన్‌ను ఆడించిన మేనేజ్‌మెంట్ రెండో వన్డేలో అతణ్ని పక్కనబెట్టడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆల్‌రౌండర్ అయిన దీపక్ హుడాను ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా వాడుకోవాలనే ఉద్దేశంతోనే శాంసన్‌ను ఆడించలేదని కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. మరి మూడో వన్డేలోనైనా శాంసన్ ఆడిస్తారేమో చూడాలి.

హాగ్లే ఓవల్ స్టేడియంలో ఇప్పటి వరకూ 22 వన్డేలు జరగ్గా.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 11సార్లు, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 11 సార్లు గెలిచాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 247 పరుగులు కాగా.. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 197గా ఉంది. ఈ గ్రౌండ్లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 275 పరుగుల లక్ష్యాన్ని చేధించడమే అతిపెద్ద లక్ష్య చేధన.

మూడో వన్డేలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. చివరి వన్డేకు సైతం వరుణుడు అడ్డు తగిలే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే సిరీస్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంటుంది.

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారెల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గ్యుసన్, జేమ్స్ నీషామ్, ఆడమ్ మిల్నే.

భారత జట్టు: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్.

Read More Sports News And Telugu News
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.