యాప్నగరం

Cuttack ODI: వెస్టిండీస్‌తో ఈరోజే ఆఖరి వన్డే.. భారత్ రికార్డ్స్‌తో కరీబియన్లలో గుబులు

భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ చరమాంకానికి చేరుకుంది. మూడు టీ20ల సిరీస్‌ని ఇప్పటికే 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌పైనా కన్నేసింది. చెపాక్‌లో జరిగిన తొలి వన్డేలో పరాజయాన్ని చవిచూసిన కోహ్లీసేన.. ఆ తర్వాత వైజాగ్ వన్డేలో 107 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేసింది. దీంతో.. విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకి కటక్ వేదికగా మ్యాచ్ జరగబోతోంది.

Samayam Telugu 22 Dec 2019, 7:59 am
భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ చరమాంకానికి చేరుకుంది. మూడు టీ20ల సిరీస్‌ని ఇప్పటికే 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌పైనా కన్నేసింది. చెపాక్‌లో జరిగిన తొలి వన్డేలో పరాజయాన్ని చవిచూసిన కోహ్లీసేన.. ఆ తర్వాత వైజాగ్ వన్డేలో 107 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేసింది. దీంతో.. విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకి కటక్ వేదికగా మ్యాచ్ జరగబోతోంది.
Samayam Telugu india vs west indies 3rd odi preview
Cuttack ODI: వెస్టిండీస్‌తో ఈరోజే ఆఖరి వన్డే.. భారత్ రికార్డ్స్‌తో కరీబియన్లలో గుబులు


Twitter-📸📸 Snapshots from #TeamIndia's training session...

రోహిత్ శర్మ, రాహుల్ నిలబడితే..?

భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలతో మళ్లీ ఫామ్ అందుకోగా.. ఇప్పుడు టీమిండియా బెంగ అంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే. భారీ అంచనాల మధ్య చెపాక్, వైజాగ్ వన్డేలో ఆడిన కోహ్లీ వరుసగా 4, 0 పరుగులకే పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో.. కనీసం ఆఖరి వన్డేలోనైనా అతను బ్యాట్ ఝళిపించాలని భారత్ ఆశిస్తోంది. ఇక మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణిస్తుండగా.. రిషబ్ పంత్ హిట్టింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

భారత్ జట్టులో మార్పులు..? చాహల్‌కి ఛాన్స్

బౌలింగ్‌లోనూ మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లయ అందుకున్నారు. కానీ.. రవీంద్ర జడేజా మాత్రం ధారాళంగా పరుగులిచ్చేస్తూ జట్టులో ఆందోళన పెంచుతున్నాడు. ఇక గాయపడిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ స్థానంలో జట్టులోకి వచ్చిన నవదీప్ షైనీకి తుది జట్టులో అవకాశమిస్తారా..? లేదా అనేది చూడాలి. శార్ధూల్ ఠాకూర్, కేదార్ జాదవ్‌లో ఒకరిపై వేటు వేసి చాహల్‌ని తీసుకోవాలనే ఆలోచనలోనూ టీమిండియా మేనేజ్‌‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

విండీస్ టీమ్‌లో ఊపుతెస్తున్న సిమ్రాన్ హిట్‌మెయర్

వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ ఎవిన్ లావిస్ దూకుడుగా ఆడుతుండగా.. సిమ్రాన్ హిట్‌మెయర్, నికోలస్ పూరన్ మిడిల్ ఓవర్లలో ఆ జోరుని కొనసాగిస్తున్నారు. ఇక కెప్టెన్ కీరన్ పొలార్డ్, జేసన్ హోల్డర్ కూడా బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తుండటం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో కాట్రెల్, అల్జారీ జోసఫ్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తుండగా.. రోస్టన్ ఛేజ్, కీమోపాల్ వైజాగ్ వన్డేలో రోహిత్, రాహుల్, శ్రేయాస్ దెబ్బకి తేలిపోయారు. దీంతో.. ఆఖరి వన్డేలోనైనా గెలిచి సిరీస్ విజయంతో పరువు నిలుపుకోవాలని కరీబియన్లు ఆశిస్తున్నారు. వెస్టిండీస్‌ గత దశాబ్దకాలంలో భారత్ గడ్డపై ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు.

Twitter-A warm and traditional welcome for #TeamIndia in B...

టీమిండియా రికార్డ్స్‌తో విండీస్‌లో గుబులు

కటక్ స్టేడియంలో వెస్టిండీస్‌కి ఏమాత్రం మెరుగైన రికార్డ్ లేదు. ఇక్కడ భారత్‌తో మూడు మ్యాచ్‌ల్లో తలపడిన కరీబియన్లు.. మూడింట్లోనూ చిత్తుగా ఓడిపోయారు. మరోవైపు కటక్‌లో ఇప్పటి వరకూ 16 మ్యాచ్‌లాడిన టీమిండియా ఏకంగా 12 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. ఇప్పుడు ఈ రికార్డులు వెస్టిండీస్ టీమ్‌లో గుబులు రేపుతున్నాయి. ఇక పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలం అనే వార్తలు వస్తుండగా.. మంచు కారణంగా ఛేదనకు దిగే జట్టుకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్‌ ఎంచుకోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.