యాప్నగరం

చెన్నై టీమ్‌లో మరో కరోనా పాజిటివ్.. ఈసారి ఓపెనర్‌కి

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కి చేరింది. శుక్రవారం ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కరోనా వైరస్ బారినపడగా.. ఈరోజు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Samayam Telugu 29 Aug 2020, 12:57 pm
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన ఆ జట్టు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా.. శుక్రవారం ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌తో పాటు 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ షాక్‌ నుంచి చెన్నై టీమ్ తేరుకోక ముందే శనివారం మరో పాజిటివ్ కేసు నమోదైంది. ఆ జట్టు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ కరోనా వైరస్ బారినపడినట్లు తేలింది. దాంతో.. ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్‌పైనా సందిగ్ధత నెలకొంది.
Samayam Telugu CSK IPL 2020 (Image Source : IPL.COM)



పుణెకి చెందిన ఈ 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్.. మహారాష్ట్ర తరఫున నిలకడ రాణిస్తున్నాడు. 2018-19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్‌ని ఐపీఎల్ 2019 ఆటగాళ్ల వేలంలో రూ. 20 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి టీమ్‌తో అతను కొనసాగుతున్నాడు. 2016-17 సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రుతురాజ్.. అప్పటి నుంచి దేశవాళీలో మెరుపులు మెరిపిస్తున్నాడు.

చెన్నై టీమ్‌లో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నెల 21 నుంచి యూఏఈలో ఆ జట్టు క్వారంటైన్‌లో ఉన్నా.. ఆటగాళ్లు నిబంధనలు అతిక్రమించి.. సామాజిక దూరం రూల్‌ని బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యూఏఈలో ఉన్న మిగిలిన ఏడు జట్లలో కనీసం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాకపోగా.. ఒక్క చెన్నై టీమ్‌లోనే 12 కేసులు నమోదవడం ఆ వాదనలకి బలం చేకూరుస్తోంది. వాస్తవానికి యూఏఈ ప్రయాణం సమయంలోనూ చెన్నై టీమ్ ఆటగాళ్లు విమానంలో నిబంధనల్ని అతిక్రమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.