యాప్నగరం

ఆసీస్ గడ్డపై ధోనీ క్రేజ్.. 87 ఏళ్ల అభిమానితో ఆప్యాయంగా!

ఆటతోనే కాకుండా తనదైన మనస్తత్వంలో అందరి మనసులనూ గెలుచుకునే ఎంఎస్ ధోనీ. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహీకి అభిమానులు. ఈ అభిమానితో అపురూప క్షణాలు వైరల్.

Samayam Telugu 14 Jan 2019, 1:04 am
మైదానంలోనూ, బయటా తనదైన ప్రవర్తనతో అందరి మనసులనూ గెలుచుకునే వ్యక్తిత్వం ఎంఎస్ ధోనీది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తనకు అనువుగా మలచుకొని నేర్పు ప్రదర్శిస్తాడు ఈ టీమిండియా మాజీ కెప్టెన్. ఆటతో పాటు ఆకట్టుకునే మనస్తత్వం కూడా ఉండటం వల్లే మహీకి అభిమానులు సంఖ్య ఎక్కువ. ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి టెన్షన్‌లోనైనా.. అభిమానులు కనిపిస్తే చిరునవ్వుతోనే పలకరిస్తాడు ధోని. అందుకే అతడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానానికి సంబంధించిన అరుదైన సందర్భం ఒకటి ఆస్ట్రేలియాలో మీడియా కళ్లకు చిక్కింది.
Samayam Telugu Ms Dhoni


ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం ఎంఎస్ ధోనీ టీమిండియాతో కలిసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ మైదానంలో భారత జట్టుతో కలిసి ధోనీ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ధోనీ అక్కడ సాధన చేస్తున్న విషయం గమనించి చాలా మంది అభిమానులు అక్కడకు వచ్చారు.
ఆ అభిమానుల్లో 87 ఏళ్ల ఎడిత్ నార్మన్ కూడా ఉన్నారు. ధోనీ అంటే ఈ పెద్దావిడక చచ్చేంత అభిమానం. తననే తదేకంగా గమనిస్తున్న నార్మన్‌ను ధోనీ చూశాడు. కాసేపటి తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించాడు. కాసేపు అక్కడే కూర్చొని బాగోగుల గురించి ఆరా తీశాడు.

తన అభిమాన ఆటగాడు తన పక్కనే కూర్చొని మాట్లాడటంతో ఆ పెద్దావిడ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడే ఉన్న వీడియోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఇంకేం.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.


‘నేను చాలా అదృష్టవంతురాలిని. ధోనీని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. క్రికెట్లో బ్రాడ్‌మన్ శకాన్ని చూసిన నేను.. నేటి తరంలో అత్యుత్తమ క్రికెటర్లను కూడా కలవడం సంతోషంగా ఉంది’ అని ఎడిత్ నార్మన్ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానితో ధోనీ అప్యాయంగా మాట్లాడటం పట్ల పొగడ్తల వర్షం కురుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.