యాప్నగరం

ఐపీఎల్‌లో ముంబయికి ఎదురుదెబ్బ.. ఫస్ట్ మ్యాచ్‌‌ నుంచి మలింగ ఔట్

ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ నాలుగు సార్లు టైటిల్ గెలవగా.. ఈ విజయాల్లో ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ క్రియాశీలక పాత్ర పోషించాడు. డెత్ ఓవర్లలో బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే మలింగ.. ఆ జట్టు ఆశలు వదిలేసిన ఎన్నో మ్యాచ్‌ల్ని కూడా గెలిపించాడు.

Samayam Telugu 1 Aug 2020, 10:24 am
ఐపీఎల్ 2020 సీజన్‌ ముంగిట డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ ఢీకొట్టబోతోంది. అయితే.. ఈ ఆరంభ మ్యాచ్‌కి ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ దూరంగా ఉండనున్నాడు. దానికి కారణం శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ఏడాది ఆరంభించబోతున్న లంక ప్రీమియర్ లీగ్ (సీపీఎల్).
Samayam Telugu Rohit Sharma Lasith Malinga


వాస్తవానికి ఇటీవల ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్‌ని సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ బీసీసీఐ తొలుత ప్లాన్ చేసింది. దాంతో.. లంక ప్రీమియర్ లీగ్‌ని ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకూ నిర్వహించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. కానీ.. అనూహ్యంగా వారం రోజులు ముందే అంటే.. సెప్టెంబరు 19 నుంచే ఐపీఎల్‌ని ప్రారంభించబోతున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించాడు. దాంతో.. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడే క్రికెటర్లు ఆలస్యంగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ముంబయి ఇండియన్స్ తరఫున లసిత్ మలింగ సుదీర్ఘకాలంగా ఆడుతుండగా.. శ్రీలంకకి చెందిన ఆల్‌రౌండర్ ఇసురు ఉదానా తొలిసారి ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో అతడ్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ. 50 లక్షలకి కొనుగోలు చేసింది. దాంతో.. మలింగ, ఉదాన తొలి మ్యాచ్‌కి దూరమవనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. శ్రీలంక నుంచి యూఏఈకి వచ్చిన వెంటనే మలింగ, ఉదాన కనిష్టంగా 72 గంటలు గరిష్టంగా 7 రోజులు క్వారంటైన్‌లో ఉండి.. కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మలింగ ఇప్పటి వరకూ 122 ఐపీఎల్ మ్యాచ్‌లాడి 177 వికెట్లు పడగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.