యాప్నగరం

పవాద్ అలామ్ సెంచరీ వృథా.. కివీస్ చేతిలో పాకిస్థాన్ చిత్తు

373 పరుగుల ఛేదనలో సెంచరీ బాదిన పవాద్ అలామ్.. ఐదో వికెట్‌కి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి న్యూజిలాండ్‌కి చెమటలు పట్టించాడు. కానీ.. 240 స్కోరు వద్ద అతని జోడీ రిజ్వాన్ ఔటవగానే సీన్ మొత్తం మారిపోయింది.

Samayam Telugu 30 Dec 2020, 12:24 pm
న్యూజిలాండ్‌తో మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌కి ఓటమి తప్పలేదు. 373 పరుగుల లక్ష్య ఛేదనలో పవాద్ అలామ్ (102: 269 బంతుల్లో 14x4) సెంచరీ బాదినా.. సహచరుల నుంచి అతనికి సహకారం లభించకపోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 271 పరుగులకి ఆలౌటైంది. దాంతో.. 101 పరుగుల తేడాతో తొలి టెస్టు‌‌లో విజయాన్ని అందుకున్న ఆతిథ్య న్యూజిలాండ్.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా ప్రారంభంకానుంది.
Samayam Telugu New Zealand vs Pakistan (Image Credit: Twitter)


శనివారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (129: 297 బంతుల్లో 12x4, 1x6) సెంచరీ బాదడంతో 431 పరుగులు చేయగలిగింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్.. 239 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో పహీమ్ ఆస్రఫ్ (91: 134 బంతుల్లో 15x4, 1x6), రిజ్వాన్ (71: 142 బంతుల్లో 8x4) మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు.

తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న న్యూజిలాండ్ టీమ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు టామ్ లాథమ్ (53: 112 బంతుల్లో 3x4), టామ్ బ్లండెల్ (64: 107 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో 180/5తో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. దాంతో.. మొత్తం 373 పరుగుల టార్గెట్ పాకిస్థాన్ ముందు నిలవగా.. మహ్మద్ రిజ్వాన్ (60: 191 బంతుల్లో 6x4)తో కలిసి ఐదో వికెట్‌కి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పవాద్ అలామ్‌తో న్యూజిలాండ్‌ని కంగారుపెట్టాడు. కానీ.. టీమ్ స్కోరు 240 వద్ద రిజ్వాన్ ఔటవగా.. ఆ తర్వాత 31 పరుగుల వ్యవధిలోనే పాకిస్థాన్ కుప్పకూలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.