యాప్నగరం

PAK vs ENG: పాక్ ఓపెనర్లు @203 నాటౌట్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్.. ధావన్-రోహిత్ రికార్డ్ బద్దలు!

PAK vs ENG: ఇంగ్లాండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యం పాకిస్థాన్ ఓపెనర్ల ముందు చిన్నబోయింది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ కలిసి 19.3 ఓవర్లలో 203 పరుగులు చేయడంతో పాక్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ సెంచరీ చేయగా.. ఇంగ్లాండ్ ఇంకొన్ని పరుగులు ఎక్కువగా చేసి ఉండుంటే రిజ్వాన్ కూడా శతకం బాదేవాడేమో. వీరిద్దరూ కలిసి ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జోడీగా రికార్డ్ క్రియేట్ చేశారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 23 Sep 2022, 2:29 pm
పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లాండ్ బౌలర్లతో ఆటాడుకున్నారు. కరాచీ వేదికగా జరిగిన రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ ఇద్దరూ కలిసి అజేయంగా 203 పరుగులు చేశారు. దీంతో పాకిస్థాన్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే.. ఇంగ్లాండ్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ 66 బంతుల్లో 110 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. రిజ్వాన్ 51 బంతుల్లో 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఏడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ 1-1తో సమం చేసింది.
Samayam Telugu Babar Azam And Rizwan
బాబర్ ఆజమ్-రిజ్వాన్


అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్‌లో అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. 2021లో దక్షిణాఫ్రికాపై 197 పరుగులు జోడించిన వీరూ.. తమ రికార్డును అధిగమించారు.

టీ20ల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా బాబర్, రిజ్వాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. వీరిద్దరూ 36 ఇన్నింగ్స్‌ల్లో 56.73 సగటుతో 1929 పరుగులు జోడించారు. ఇందులో ఏడు సెంచరీలు ఉండగా.. ఆరు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశారు. ధావన్-రోహిత్ జోడీ 52 ఇన్నింగ్స్‌ల్లో 33.51 యావరేజ్‌తో 1743 పరుగులు జోడించింది.

ఇంగ్లాండ్‌పై సెంచరీతో సత్తా చాటిన బాబర్.. మరో 105 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన తొలి పాకిస్థాన్ బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. టీ20ల్లో 8 వేల పరుగులు చేసిన రెండో పాకిస్థాన్ బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు. ఇంతకు ముందు పాక్ నుంచి షోయబ్ మాలిక్ మాత్రమే టీ20ల్లో 8 వేలకుపైగా పరుగులు సాధించాడు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.