యాప్నగరం

India Vs Australia Test Series: రెండో టెస్టుకూ పృథ్వీ షా దూరం!

మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ఈ ముంబయి ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Samayam Telugu 12 Dec 2018, 4:59 pm
ఆసీస్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిరోజు భారత్ ఆటతీరు చూస్తే అసలు ఈ మ్యాచ్‌ను డ్రాగా అయినా ముగిస్తుందా? అని అభిమానులు కలవరపడ్డారు. అయితే రెండో రోజు నుంచి అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా బౌలర్లు ఆసీస్‌ను ఓ ఆటాడుకున్నారు. ఆసీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను విజయంతో స్టార్ట్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
Samayam Telugu prithvi-shaw


ఆసీస్‌‌తో టెస్టు సిరీస్‌కు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఓపెనర్ పృథ్వీ షా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడటంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్, మురళీ విజయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఫర్వాలేదనిపించారు. పృథ్వీ గాయం నుంచి కోలుకుని పెర్త్‌లో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే గాయం ఇంకా తగ్గకపోవడంతో రెండో టెస్ట్‌కు ఈ చిచ్చరపిడుగు అందుబాటులో ఉండటం లేదు. దీంతో తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగనుంది.

పృథ్వీ క్రమంగా కోలుకుంటున్నాడని.. ప్రస్తుతం నడుస్తున్నాడని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మరో రెండు మూడు రోజుల్లో పరుగు పెడతాడన్నారు. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ఈ ముంబయి ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి సంచలనం ఆటగాడిగా ముద్ర పడిన పృథ్వీ షా ఆసీస్ సిరీస్‌లో అద్భుతాలు చేస్తాడని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కాలికి గాయం కావడంతో అనూహ్యంగా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.