యాప్నగరం

రోహిత్ శర్మ భలే సమాచారం సేకరిస్తాడు: కోచ్ జయవర్దనె

మ్యాచ్‌లో టీమ్‌ గెలిచినా.. ఓడినా.. ఆటగాళ్ల తప్పిదాలు.. టర్నింగ్ పాయింట్లని స్టేడియంలో కూర్చుని కోచ్‌లు నోట్స్‌లా రాస్తుంటారు. అవి తర్వాత మ్యాచ్‌కి ఉపయోగపడతాయి. కానీ.. కోచ్ చేసే పనుల్ని ఐపీఎల్‌లో కొన్నిసార్లు రోహిత్ శర్మ చేస్తుంటాడట.

Samayam Telugu 23 Jun 2020, 6:01 pm
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమ్‌లోని ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి టీమ్ సమాచారం సేకరించడంలో దిట్ట అని ఆ జట్టు కోచ్ మహేల జయవర్దనె వెల్లడించాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్ టీమ్ ఏకంగా నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. టోర్నీ చరిత్రలో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు టోర్నీ విజేతగా నిలవలేదు.
Samayam Telugu Rohit Sharma


2017 ఐపీఎల్ సీజన్ ముంగిట ముంబయి ఇండియన్స్ టీమ్ కోచ్‌గా మహేల జయవర్దనె బాధ్యతలు చేపట్టగా.. అప్పటికే ఆటగాళ్లకి సంబంధించి పూర్తి సమాచారం రోహిత్ శర్మ వద్ద ఉన్నట్లు జయవర్దనె పరోక్షంగా వెల్లడించాడు. ఒక్కోసారి టీమ్ కోచ్‌ సేకరించాల్సిన సమాచారం కూడా రోహిత్ శర్మ అప్పటికే సేకరించి ఉండటం తనని ఆశ్చర్యపరిచిందన్న జయవర్దనె.. అనలిస్ట్ వద్ద గంటల కొద్దీ కూర్చుని మరీ హిట్‌మ్యాన్ ఆటగాళ్ల తప్పిదాల్ని సేకరించేవాడని చెప్పుకొచ్చాడు. ఆ నైజమే అతడ్ని ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిపిందని జయవర్దనె వివరించాడు.

‘‘రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్. టీమ్ ఆటగాళ్లకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అతను సేకరిస్తుంటాడు. ఒక కెప్టెన్‌గా ఆ సేకరణ అతని బలం. ముంబయి ఇండియన్స్‌‌ జట్టులో పెద్ద పెద్ద టీమ్ మీటింగ్‌లు ఏమీ ఉండవు. ఎప్పుడైనా జట్టుకి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. రోహిత్ శర్మ తన వద్ద ఉన్న సమాచారాన్ని టీమ్ ముందు ఉంచుతుంటాడు. వాస్తవానికి ఆటగాళ్ల తప్పిదాలు, ప్రత్యర్థి టీమ్ బలహీనతలకి సంబంధించి సమాచారం సేకరించడం కోచ్ బాధ్యత. కానీ.. రోహిత్ శర్మ అనలిస్ట్ పక్కన కూర్చుని ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తుంటాడు’’ అని మహేల జయవర్దనె వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.