యాప్నగరం

రోహిత్, ధావన్ అర్ధశతకాలు.. న్యూజిలాండ్ టార్గెట్ 325

జట్టు స్కోరు 236 వద్ద కోహ్లీని ఔట్ చేసి భారత్‌ని దెబ్బతీసిన బౌల్ట్.. ఆ తర్వాత ధోనీ, అంబటి రాయుడుకి కాసేపు బ్యాట్ ఝళిపించే అవకాశం ఇవ్వలేదు. దీంతో దాదాపు ఆరు ఓవర్ల పాటు భారత్ కనీసం ఒక బౌండరీ కూడా సాధించలేకపోయింది.

Samayam Telugu 26 Jan 2019, 11:38 am
న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (87: 96 బంతుల్లో 9x4, 3x6), శిఖర్ ధావన్ (66: 67 బంతుల్లో 9x4) అర్ధశతకాలు బాదగా.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (48 నాటౌట్: 33 బంతుల్లో 5x4, 1x6) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. మధ్య ఓవర్లలో అంబటి రాయుడు (47: 49 బంతుల్లో 3x4, 1x6), కెప్టెన్ విరాట్ కోహ్లి (43: 45 బంతుల్లో 5x4), ఆఖర్లో కేదార్ జాదవ్ (22: 10 బంతుల్లో 3x4, 1x6) సమయోచిత హిట్టింగ్‌తో ఆకట్టుకున్నారు.
Samayam Telugu 1509273710-Rohit_Sharma_vs_New_Zealand_3rd_ODI


టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభ ఓవర్‌ నుంచే దూకుడుగా ఆడిన ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ తొలి వికెట్‌కి అభేద్యంగా 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకి శుభారంభమిచ్చింది. అయితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ వేసిన బౌల్ట్ తొలుత ధావన్‌ని ఔట్ చేయగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మని ఫర్గూసన్ పెవిలియన్ బాట పట్టించాడు. ఈ దశలో.. క్రీజులో కుదురుకున్న కెప్టెన్ కోహ్లీ బ్యాట్ ఝళిపించడంతో ఒకానొక సమయంలో భారత్ 350పైచిలుకు స్కోరు సాధించేలా కనిపించింది.

కానీ.. జట్టు స్కోరు 236 వద్ద కోహ్లీని ఔట్ చేసి భారత్‌ని దెబ్బతీసిన బౌల్ట్.. ఆ తర్వాత ధోనీ, అంబటి రాయుడుకి కాసేపు బ్యాట్ ఝళిపించే అవకాశం ఇవ్వలేదు. దీంతో దాదాపు ఆరు ఓవర్ల పాటు భారత్ కనీసం ఒక బౌండరీ కూడా సాధించలేకపోయింది. అయితే.. ఆఖరి ఓవర్ వేసిన ఫర్గూసన్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్, ధోనీ వరుసగా 4, 6, 4, 1, 4, 2తో ఏకంగా 21 పరుగులు పిండుకున్నారు. దీంతో.. భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.