యాప్నగరం

India vs WI 4th ODI: 224 పరుగులతో భారత్ ఘన విజయం

మూడో వన్డేలో ఎదురైన ఓటమికి విరాట్ కోహ్లీ సేన రికార్డు విజయంతో బెబ్బులిలా ప్రతీకారం తీర్చుకుంది.

Samayam Telugu 29 Oct 2018, 9:48 pm
వెస్టిండీస్‌తో జరిగిన కీలకమైన 4వ వన్డేలో టీమిండియా 224 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. దీంతో మూడో వన్డేలో ఎదురైన ఓటమికి బెబ్బులిలా ప్రతీకారం తీర్చుకుంది. 378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఒంటరి పోరు (54: 70 బంతుల్లో 1x4, 2x6)చేశాడు. టెస్ట్ హోదా జట్లపై వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కాగా, ఓవరాల్‌గా మూడోది. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌లు తలో వికెట్ తీశారు..
Samayam Telugu India


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20x4, 4x6), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8x4, 4x6) శతకాల మోత మోగించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. తొలి మూడు వన్టేల్లో అద్భుత పోరాటాన్ని ప్రదర్శించిన విండీస్ నాలుగో వన్డేలో పూర్తిగా తేలిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా విఫలమైంది.

378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఓపెనర్లు హెమరాజ్, పావెల్ సహా వన్‌డౌన్ ప్లేయర్ షై హోప్(0) వికెట్లు కోల్పోవడంతో విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ రెండో బంతికి భువనేశ్వర్ విండీస్ ఓపెనర్ హెమరాజ్‌ను ఔట్ చేశాడు. హెమరాజ్ ఆడిన బంతిని రాయుడు క్యాచ్ పట్టడంతో 20 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన విండీస్.. అదే పరుగు వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది.

షై హోప్ లేని పరుగు కోసం ప్రయత్నించగా.. ఫీల్డర్ కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరే రీతిలో బంతిని నేరుగా వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. తర్వాత ఓవర్‌లో తడబాటు కారణంగా ఓపెనర్ పొవెల్ కూడా రనౌటయ్యాడు. మరో కీలక ఆటగాడు హిట్ మెయిర్‌ భారత యువ సంచలనం ఖలీల్ అహ్మద్‌కు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన విండీస్ ఓటమి దాదాపు ఖాయమైంది. భారత కొత్త బౌలర్ ఖలీల్ అహ్మద్ తన వరుస ఓవర్లలో ఒక్కో ఆటగాడిని పెవిలియన్ బాట పట్టించి విండీస్ మిడిలార్డర్ నడ్డి విరిచాడు.

ఖలీల్ 5 ఓవర్లలో 3 వికెట్లు తీసి 13 పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హిట్ మెయిర్(13)ను, 12వ ఓవర్లో పావెల్(1)ను, 14వ ఓవర్లో శామ్యూల్స్ (18)ను ఖలీల్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన విండీస్‌ జట్టును హోల్డర్ ఆదుకోవడంతో 150 పరుగుల మార్క్ చేరుకుంది. చివరి వికెట్‌గా కీమర్ రోచ్‌ను కుల్దీప్ ఔట్ చేయడంతో భారత్ సంబరాలు మొదలుపెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.