యాప్నగరం

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. చివరి టెస్టులో చారిత్రక గెలుపు

ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. చివరి టెస్టులో అసాధ్యమనుకున్న 328 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి రోజు అసాధారణరీతిలో టీమిండియా ఛేదించేసింది.

Samayam Telugu 19 Jan 2021, 1:37 pm
ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి భారత్ జట్టు చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. బ్రిస్బేన్ వేదికగా మంగళవారం ముగిసిన చివరి టెస్టులో 328 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. రిషబ్ పంత్ (89 నాటౌట్: 138 బంతుల్లో 9x4, 1x6), శుభమన్ గిల్ (91: 146 బంతుల్లో 8x4, 2x6) దూకుడుగా ఆడటంతో మూడు వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో.. నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న భారత్ జట్టు.. రెండోసారి ఆ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. 2018-19లోనూ నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో టీమిండియా అక్కడ గెలిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu Rishabh Pant (Image Source: Twitter)



328 లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో చివరి రోజైన మంగళవారం 4/0తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా ఆరంభంలోనే రోహిత్ శర్మ (7) వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారా (56: 211 బంతుల్లో 7x4) మరీ నెమ్మదిగా ఆడటంతో భారత్ గెలుపుపై ఆశలు వదిలేసి డ్రా కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కానీ.. రెండో సెషన్‌లో దూకుడు పెంచిన శుభమన్ గిల్.. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో టీమిండియాలో ఊపు వచ్చింది. అయితే సెంచరీ ముంగిట గిల్ ఔటవగా.. అజింక్య రహానె (24: 22 బంతుల్లో 1x4, 1x6), మయాంక్ అగర్వాల్ (9: 15 బంతుల్లో 1x4) దూకుడుగా ఆడే ప్రయత్నంలో కీలక సమయంలో ఔటయ్యారు. కానీ.. స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న రిషబ్ పంత్.. కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (22: 29 బంతుల్లో 2x4, 1x6)తో కలిసి చివరి సెషన్‌ ఆఖర్లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడేశాడు. గెలుపు ముంగిట సుందర్, శార్ధూల్ ఠాకూర్ (2) ఔటైనా.. బాధ్యతాయుతంగా చివరి వరకూ క్రీజులో నిలిచి బౌండరీతో గెలుపు లాంఛనాన్ని 329/7తో పూర్తి చేసేశాడు. భారత్‌ని గెలిపించిన పంత్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.



శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకి ఆలౌటవగా.. 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆస్ట్రేలియాకి లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసిన కంగారూలు.. మొత్తంగా 328 పరుగుల టార్గెట్‌ని భారత్‌ని నిర్దేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.