యాప్నగరం

ఐసీసీ దశాబ్దపు వన్డే క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఎంపిక.. ఒకే ఒక్కడు

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ దశాబ్దంలో 10వేల వన్డే పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 39 సెంచరీలు నమోదు చేశాడు. దాంతో.. ఐసీసీ అతడ్ని దశాబ్దపు వన్డే క్రికెటర్‌గా ఎంపిక చేసింది.

Samayam Telugu 28 Dec 2020, 3:44 pm
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ దశాబ్దపు వన్డే క్రికెటర్‌‌గా ఎంపికయ్యాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 251 వన్డే మ్యాచ్‌లాడి 12,040 పరుగులు చేయగా.. ఇందులో 43 సెంచరీలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ దశాబ్దంలోనే 61.83 సగటుతో 10,000 పైచిలుకు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఏకంగా 39 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఈ దశాబ్దంలో 10వేల వన్డే పరుగుల్ని చేయలేదు. దాంతో.. ఐసీసీ దశాబ్దపు వన్డే క్రికెటర్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. ఈ పదేళ్లలో కోహ్లీ వన్డేల్లో 112 క్యాచ్‌లు కూడా పట్టడం విశేషం.
Samayam Telugu Virat Kohli (Image Credit: AP)


2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఉన్న కోహ్లీ.. ఆ తర్వాత 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన టీమ్‌లోనూ ఉన్నాడు. ఇక 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌‌లో కెప్టెన్‌గా భారత్‌ని గెలిపించిన కోహ్లీ.. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనతని అందుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ ఈ విజయమే.. ఐసీసీ దశాబ్దపు టెస్టు టీమ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యేలా చేసింది.

2015 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ.. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరిన టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్ జట్టు సెమీస్‌కి చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే 70 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 శతకాల రికార్డ్‌ని బద్దలు కొట్టగల ఏకైక క్రికెటర్‌గా కనిపిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.