యాప్నగరం

విరాట్ కోహ్లీ వెళ్తూ.. అందర్నీ అలా మార్చేసి వెళ్లాడు: రవిశాస్త్రి

328 పరుగుల ఛేదనని చివరి రోజు 4/0తో ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకుంది. దాంతో.. భారత్ గెలుపుపై ఎవరికీ ఆశల్లేవు. కానీ.. ఓ ఇద్దరు యువ క్రికెటర్లు.. టీమిండియాకి ఊహించని గెలుపుని అందించారు.

Samayam Telugu 19 Jan 2021, 6:23 pm
ఆస్ట్రేలియా గడ్డపై మంగళవారం చారిత్రక టెస్టు సిరీస్ విజయం సాధించిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బ్రిస్బేన్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో 328 పరుగుల భారీ టార్గెట్ ముందున్నా.. బెరుకు లేకుండా ఆడిన టీమిండియా మరో 19 బంతుల ఆట మిగిలి ఉండగానే 329/7తో విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా.. యువ క్రికెటర్లు రిషబ్ పంత్ (89 నాటౌట్: 138 బంతుల్లో 9x4, 1x6), శుభమన్ గిల్ (91: 146 బంతుల్లో 8x4, 2x6) ఛేదనలో దూకుడుగా ఆడటం ద్వారా టీమిండియాలో ఉత్సాహం నింపారు.
Samayam Telugu Virat Kohli (Image Credit: Twitter)


వాస్తవానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ గడ్డలపై టెస్టులు ఆడే సమయంలో భారీ టార్గెట్ ముందుంటే.. ఒకప్పుడు భారత్ జట్టు డ్రా కోసం ప్రయత్నించేది. కానీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ ధోరణిలో మార్పు వచ్చింది. స్వయంగా కోహ్లీనే ఓటమి గురించి భయపడకుండా దూకుడుగా ఆడేవాడు. తాజా ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత పెటర్నిటీ లీవ్‌పై స్వదేశానికి వచ్చేసిన కోహ్లీ.. అక్కడ టీమ్‌ని వీడే ముందు ఒక ప్రత్యేక మీటింగ్‌ని ఏర్పాటు చేసి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు.

బ్రిస్బేన్ టెస్టు విజయంపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. గెలుపు కాంక్షని సహచరుల్లోనూ విరాట్ కోహ్లీ రుద్దేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. ‘‘కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనని కనబర్చారు. వారిని పొగిడేందుకు మాటలు దొరకడం లేదు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకి ఆలౌలైన తర్వాత.. టీమ్ పుంజుకున్న తీరు ప్రశంసనీయం. ఇదేమీ రాత్రికి రాత్రే తయారైన జట్టు కాదు. విరాట్ కోహ్లీ ఇక్కడ టీమ్‌తో లేకపోయినా... అందరిపైనా గెలుపు కాంక్షని రుద్ది వెళ్లాడు. రహానె చాలా కామ్‌గా ఉంటాడు. కానీ.. అంతర్లీనంగా అతను చాలా స్ట్రాంగ్’’ అని రవిశాస్త్రి కితాబిచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.