యాప్నగరం

వరల్డ్‌కప్ తర్వాత ప్రతిరోజూ ఆ సెగ నన్ను తాకింది: రిషబ్ పంత్ భావోద్వేగం

రిషబ్ పంత్ ఇప్పుడు టీమిండియాలో హీరో. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న రిషబ్ పంత్.. టీమిండియాకి చారిత్రక విజయాన్ని అందించాడు. కానీ.. ఏడాదన్నరగా..?

Samayam Telugu 25 Jan 2021, 2:32 pm
ఆస్ట్రేలియా టూర్‌లో సంచలన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన యువ హిట్టర్ రిషబ్ పంత్.. ఇప్పుడు టీమిండియాలో నయా హీరోగా మారిపోయాడు. చివరి రెండు టెస్టుల్లోనూ భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుని తన హిట్టింగ్‌తో ఉత్సాహం నింపిన రిషబ్ పంత్.. ఆ గడ్డపై టీమిండియా చారిత్రక టెస్టు సిరీస్‌ని గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. వాస్తవానికి పంత్ నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లను ఎవరూ ఊహించలేదు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైనా తొలి టెస్టులో అతనికి అవకాశం దక్కలేదు. దానికి కారణం.. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోవడమే.
Samayam Telugu Rishabh Pant (Photo: Getty Images)


దాదాపు ఏడాదన్నరపాటు టెస్టులు, వన్డేలతో పాటు టీ20ల్లోనూ తేలిపోతూ వచ్చిన రిషబ్ పంత్.. తన స్థానాన్ని కేఎల్ రాహుల్, సంజు శాంసన్, సాహాకి కోల్పోతూ వచ్చాడు. ఈ క్రమంలో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కెరీర్ ఆరంభంలో జూనియర్ ధోనీగా కితాబులు అందుకున్న పంత్.. బ్యాటింగ్‌లోనే కాదు కీపింగ్‌లోనూ తప్పిదాలతో భారత్ జట్టు ఓటమికి ప్రత్యక్షంగా కారణమయ్యాడు. దాంతో.. పంత్ ఇక పుంజుకోవడం కష్టమేననే మాటలు కూడా వినిపించాయి. కానీ.. ఈ యువ హిట్టర్ బలంగా పుంజుకున్నాడు. ఆటని మెరుగు పర్చుకుని.. సరికొత్త ఫినిషర్‌గా అవతరించాడు.

ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇటీవల వచ్చిన రిషబ్ పంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గత ఏడాదన్నరగా తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి భావోద్వేగంగా వివరించాడు. ‘‘ప్రతి రోజూ నాకు విమర్శల సెగ తాకుతున్నట్లు అనిపించేది. ఆటలో అవన్నీ భాగమని నాకు తెలుసు. కానీ.. వ్యక్తిగతంగా కష్టమైంది. అయితే.. నా చుట్టూ ఉన్న కొద్ది మంది నాకు మద్దతుగా నిలిచి.. ఆత్మస్థైర్యాన్ని నింపారు. దాంతో.. నా ఆటని మెరుగు పర్చుకోవడంపై శ్రద్ధ పెట్టా. అయినప్పటికీ.. ఈ సోషల్ మీడియా ద్వారా ఆ విమర్శల సెగ నన్ను తాకేది. దాంతో.. వాటికి దూరంగా ఉండిపోయాను. నువ్వు బాగా ఆడితే.. అందరూ బాగా రాస్తారు. ఒకవేళ ఫెయిలైతే విమర్శిస్తారు. క్రికెటర్ జీవితంలో ఇవి సహజం. కాబట్టి.. ఆ విమర్శలపై కాకుండా ఆటపై శ్రద్ధ పెడితే మంచిది అని నేను నిర్ణయించుకున్నా’’ అని రిషబ్ పంత్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.