యాప్నగరం

ఒకే రోజు ముగ్గురు శ్రీలంక క్రికెటర్ల పెళ్లి.. హిందీ పాటలకు స్టెప్పులేసిన ఆటగాళ్లు!

అప్ఘానిస్థాన్‌తో సిరీస్ మధ్యలో శ్రీలంక క్రికెటర్లు పెళ్లి పీటలెక్కారు. ముగ్గురు ఆటగాళ్లు ఒకే రోజు కొలంబోలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా ఒకే చోట చేరి ఆడిపాడారు. హిందీ పాటలకు స్టెప్పులేస్తూ సరదాగా గడిపారు. కసున్ రజిత, పతుమ్ నిస్సంక, చరిత్ అసలంక ఒకే రోజు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ హనీమూన్ మాత్రం తర్వాతే ఉండనుంది. పెళ్లి అయిన మరుసటి రోజే ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టుతో కలవడమే దీనికి కారణం.

Authored byరవి కుమార్ | Samayam Telugu 29 Nov 2022, 1:15 pm

ప్రధానాంశాలు:

  • ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు క్రికెటర్లు
  • రజిత, నిస్సంక, అసలంకకు అభినందనలు తెలిపిన శ్రీలంక క్రికెట్ బోర్డ్
  • అప్ఘాన్‌తో సిరీస్ మధ్యలో పెళ్లిళ్లు చేసుకున్న ఆటగాళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sri Lanka Cricketers Wedding
Sri Lanka Cricketers Wedding
ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు ఒకే రోజు పెళ్లిళ్లు చేసుకున్నారు. అది కూడా అప్ఘానిస్థాన్‌తో సిరీస్ మధ్యలో కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంక జట్టు అప్ఘాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతుండగా.. రెండో వన్డే ముగిశాక.. మూడు రోజుల విరామం లభించింది. ఈ బ్రేక్‌లో లంక క్రికెటర్లు కసున్ రజిత, పతుమ్ నిస్సంక, చరిత్ అసలంక పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ ముగ్గురికీ శ్రీలంక క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపింది. ముగ్గురు క్రికెటర్ల పెళ్లి ఫొటోలను లంక బోర్డు ట్వీట్ చేసింది.
పెళ్లి తంతు ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఆటగాళ్లు హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను శ్రీలంక క్రికెటర్ లాహిరు మదుషంక షేర్ చేశాడు. బాలీవుడ్ చార్ట్ బస్టర్ ‘దేశీ గర్ల్’‌కు పెళ్లి కొడుకు రజితతోపాటు రమేశ్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమ, దిల్షాన్ ముదషంక, లసిత్ ఎంబల్దేనియా స్టెప్పులేస్తుండటాన్ని ఈ వీడియోలో గమనించొచ్చు. స్థానిక డ్యాన్సర్లతో కలిసి హిందీ పాటలకు డ్యాన్స్‌లు వేసిన శ్రీలంక క్రికెటర్లు అందరి దృష్టిని ఆకర్షించారు.

శ్రీలంక, అప్ఘానిస్థాన్ మధ్య చివరి వన్డే బుధవారం క్యాండీలో జరగనుంది. తొలి మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో అప్ఘాన్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. తొలి వన్డేలో శ్రీలంక ఓడినప్పటికీ నిస్సంక 85 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ ఆతిథ్య జట్టు 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మరోవైపు ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఐదు అదనపు పాయింట్లు అప్ఘాన్ ఖాతాలో చేరాయి. దీంతో 115 పాయింట్లు సాధించిన అప్ఘానిస్థాన్.. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో ఏడో స్థానానికి చేరుకుంది. టాప్-8 టీమ్‌లు వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. దీంతో అప్ఘానిస్థాన్ క్వాలిఫై కాగా.. శ్రీలంక ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లే ఆడాల్సి ఉండటంతో.. టాప్-8లో నిలవడం కష్టంగా మారింది.

వాస్తవానికి వర్షం కారణంగా రద్దయిన రెండో వన్డేలో అప్ఘానిస్థాన్‌ను శ్రీలంక 228 పరుగులకే పరిమితం చేసింది. రహ్మనుల్లాహ్ గుర్బాజ్ (68), రహ్మత్ షా (58) హాఫ్ సెంచరీలు సాధించారు. కానీ లంక బౌలర్లు వనిందు హసరంగ (1/39), ధనంజయ డి సిల్వా (1/37) తక్కువ పరుగులిచ్చి కట్టడి చేశారు. శ్రీలంక మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసిన దశలో వర్షం కురవడంతో మ్యా్చ్ రద్దయ్యింది.

Read More Sports News And Telugu News
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.