యాప్నగరం

Virat Kohli: కింగ్ కోహ్లి రికార్డ్ శతకం.. సత్తా చాటిన రోహిత్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

శ్రీలంకతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు సత్తా చాటారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించగా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి వన్డేల్లో వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కోహ్లికి ఇది 73వ సెంచరీ కావడం గమనార్హం. ఈ ఏడాది వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 10 Jan 2023, 5:16 pm
గువహటిలోని బర్సపారా స్టేడియం వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో విరాట్ కోహ్లి సెంచరీ (87 బంతుల్లో 113)తో చెలరేగడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. కోహ్లి శతకానికి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్ధ శతకాలు తోడవటంతో టీమిండియా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు రోహిత్ శర్మ (67 బంతుల్లో 83), శుభ్‌మన్ గిల్ (60 బంతుల్లో 70) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 19.4 ఓవర్లలోనే 143 పరుగులు జోడించారు. గిల్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చిన షనక శ్రీలంకకు బ్రేక్ ఇచ్చాడు.
Samayam Telugu Virat Kohli
Virat Kohli


సెంచరీ చేసేలా కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ మదుషంక ఓవర్లో బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యాడు. శ్రేయస్ అయ్యర్‌ (28)తో కలిసి జట్టు స్కోరును 200 మార్క్ దాటించిన విరాట్ కోహ్లి.. కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 39)తో కలిసి 40 ఓవర్లలోనే 300 పరుగులు దాటించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. విరాట్ కోహ్లి దూకుడుగా ఆడాడు. రెండు తేలికైన క్యాచ్‌ను లంక ఫీల్డర్లు జారవిడవటం విరాట్‌కు కలిసొచ్చింది.

47వ ఓవర్ తొలి బంతికే బౌండరీ బాది 99 పరుగులు పూర్తి చేసిన కోహ్లి.. మరుసటి బంతికి సింగిల్ తీసి.. 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లికి వన్డేల్లో ఇది 45వ శతకం కాగా.. వన్డే ఫార్మాట్లో వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ కోహ్లి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. బర్సపారా స్టేడియంలోనూ కోహ్లికి ఇది వరుసగా మూడో శతకం కావడం గమనార్హం. కోహ్లి కెరీర్లో ఓవరాల్‌గా ఇది 73వ శతకం కావడం విశేషం.

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (49) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 45 శతకాలు చేయడానికి 424 ఇన్నింగ్స్ తీసుకోగా.. కోహ్లి 257 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. 2023లో వన్డేల్లో శతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఓ దశలో భారత్ 400 పరుగులు దాటేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. 48వ ఓవర్లో అక్షర్ (9) ఔట్ కాగా.. మరుసటి ఓవర్లో కోహ్లి ఔటయ్యాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.

Read More Sports News And Telugu News
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.