యాప్నగరం

విరాట్ కోహ్లీకి జరిమానా.. ఫీజులో 25 శాతం కోత

ఐసీసీ నియామవళిని ఉల్లంఘించిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది.

TNN 16 Jan 2018, 5:24 pm
ఐసీసీ నియామవళిని ఉల్లంఘించిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో అంపైర్ మైకేల్ గాఫ్‌తో విరాట్ కోహ్లీ దురుసుగా ప్రవర్తించినందుకు అతనికి ఐసీసీ లెవెల్ 1 కింద జరిమానా విధించింది. ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1.1ను కోహ్లి ఉల్లంఘించాడు. ఇది క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
Samayam Telugu virat kohli fined 25 percent match fee for breaching icc code of conduct
విరాట్ కోహ్లీకి జరిమానా.. ఫీజులో 25 శాతం కోత


దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయంలో 25వ ఓవర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజైన సోమవారం వర్షం కారణంగా ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. ఆ తరవాత మళ్లీ కొంతసేపటికి ఆటను ప్రారంభించారు. అయితే అవుట్ ఫీల్డ్ తడిగా ఉందని అంపైర్ మైకేల్ గాఫ్‌కు కోహ్లీ పదే పదే ఫిర్యాదు చేశాడు. దీని వల్ల ప్రభావం బంతిపై పడుతుందని చెప్పాడు. అయితే కోహ్లీ వాదనతో గాఫ్ ఏకీభవించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కోహ్లీ బంతిని మైదానంలోకి విసిరేశాడు.

మ్యాచ్ అనంతరం దీనిపై ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్.. కోహ్లీని వివరణ కోరారు. తాను తప్పుచేసినట్లు కోహ్లీ ఒప్పుకోవడంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జతచేశారు. కోహ్లీ తప్పు ఒప్పుకోవడంతో తదుపరి విచారణ అవసరం లేదని క్రిస్ బ్రాడ్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్ 1 అనేది సాధారణ జరిమానా. దీని కింద మ్యాచ్ ఫీజులో అత్యధికంగా 50 శాతం కోతతో పాటు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు జత చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.