యాప్నగరం

కోహ్లీ ముందు మరో రికార్డ్.. నేటి మ్యాచ్‌లో సాధిస్తాడా?

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు.

Samayam Telugu 27 Jun 2018, 6:34 pm
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. టీ20ల్లో భారత్ తరఫున 2000 పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ అవతరించనున్నాడు. అలాగే ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత తక్కువ మ్యాచుల్లో 2వేల పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలవనున్నాడు. అయితే ఈ రికార్డు సాధించాలంటే కోహ్లీకి ఇంకా 17 పరుగులు అవసరం. ఇప్పటి వరకు కోహ్లీ 57 టీ20 మ్యాచుల్లో (53 ఇన్నింగ్స్) 50.84 సగటుతో 1983 పరుగులు సాధించాడు. నేడు ఐర్లాండ్‌తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లీ 17 పరుగులు సాధిస్తే 2వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
Samayam Telugu Kohli


ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఆటగాళ్లు మార్టిన్ గుప్తిల్, బ్రెండన్ మెక్‌కలమ్ మాత్రమే 2వేల పరుగులు పూర్తిచేశారు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్టిన్ గుప్తిల్ (2271) మొదటి స్థానంలో ఉన్నాడు. 2140 పరుగులతో మెక్‌కలమ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ 1989 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వీళ్ల ముగ్గురి తరవాత కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈరోజు గనుక కోహ్లీ 2వేల పరుగులు పూర్తిచేస్తే టీ20లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.

మెక్‌కలమ్ తన 66వ మ్యాచ్‌లో 2వేల మైలురాయిని అందుకోగా.. గుప్తిల్ 68 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఈ రోజు మ్యాచ్‌లో కోహ్లీ 17 పరుగులు చేస్తే 59 మ్యాచుల్లోనే 2వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు. ఒకవేళ ఈరోజు వీలుకాకపోయినా ఐర్లాండ్‌తో మరో మ్యాచ్ ఉంది కాబట్టి ఈ సిరీస్‌లో అయితే రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.