యాప్నగరం

ఐపీఎల్ 2020 సీజన్ లేకుండా ఈ ఏడాది ముగియదు: గంగూలీ

ఐపీఎల్ 2020 సీజన్‌ ఒకవేళ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుంది. ఆ ప్రభావం భారత క్రికెట్‌పైనా తీవ్రంగా పడనున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వహణపై గంగూలీ పట్టుదలతో ఉన్నాడు.

Samayam Telugu 8 Jul 2020, 7:38 pm
ఐపీఎల్ 2020 సీజన్ ఈ ఏడాది జరగడం తథ్యమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడితేనే.. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందని వార్తలు వస్తుండగా.. మరోవైపు ఐపీఎల్‌ని అడ్డుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాంతో.. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 సీజన్‌ని ఈ ఏడాది ఆపకూడదని గంగూలీ పట్టుదలతో ఉన్నాడు.
Samayam Telugu Sourav Ganguly
Sourav Ganguly.Photo)


టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేస్తే.. సెప్టెంబరు చివరి వారం నుంచి నవంబరు మొదటి వారం వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ.. సెప్టెంబరులో ఆసియా కప్ 2020 టోర్నీని నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించిన పీసీబీ.. నవంబరులోనూ పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై తుది నిర్ణయం ప్రకటించకుండా ఐసీసీ నాన్చుడి ధోరణిలో వ్యవహరిస్తోంది. ఐసీసీ, పీసీబీ కుటిల ఆలోచనల కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ని ఈ ఏడాది నిర్వహించడం బీసీసీఐకి ఓ సవాల్‌గా మారింది.

‘‘ఐపీఎల్ లేకుండా ఈ ఏడాదిని ముగించకూడదని మేము పట్టుదలతో ఉన్నాం. కరోనా వైరస్ నేపథ్యంలో.. భారత్‌లో టోర్నీకి అవకాశం లేకపోతే విదేశాల్లో నిర్వహిస్తాం. కానీ.. అది చివరి ఆప్షన్ మాత్రమే. ఆతిథ్యం విషయంలో బీసీసీఐ ఫస్ట్ ప్రాధాన్యత భారత్‌కే. బీసీసీఐ.. ఐపీఎల్ ఆతిథ్యం గురించి ఇప్పటి వరకూ ఏ దేశ క్రికెట్ బోర్డుతోనూ చర్చించలేదు’’ అని గంగూలీ వెల్లడించాడు. ఈరోజు గంగూలీ 48వ పుట్టినరోజు జరుపుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.