యాప్నగరం

వరల్డ్‌కప్‌ కోసం పాక్‌ జట్టుని భారత్‌లోకి రానిస్తారా..? అయితే రాసివ్వండి

2021 టీ20 వరల్డ్‌కప్, 2023 వన్డే ప్రపంచకప్‌కి భారత్ ఆతిథ్యమివ్వనుండగా.. ఆ టోర్నీల్లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుని అనుమతించడంపై ఇప్పటి నుంచే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 25 Jun 2020, 8:36 am
భారత్ వరుసగా రెండు ఐసీసీ వరల్డ్‌కప్‌లకి ఆతిథ్యమివ్వబోతోంది. దాంతో.. ఆ టోర్నీల్లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుని ఇక్కడికి అనుమతిస్తారా..? అనే సందేహం ఇప్పటి నుంచే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో మొదలైనట్లు తెలుస్తోంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌ భారత్‌ వేదికగా జరగనుండగా.. 2023 వన్డే ప్రపంచకప్‌కి మనమే ఆతిథ్యమివ్వనున్నాం. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని ఆశ్రయించి పీసీబీ.. రెండు వరల్డ్‌కప్‌లకి పాక్ జట్టుని భారత్‌లోకి అనుమతిస్తామని రాతపూర్వకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి హామీని ఇప్పించాలని కోరినట్లు తెలుస్తోంది.
Samayam Telugu India vs Pakistan


రాతపూర్వక హామీపై పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ మాట్లాడుతూ ‘‘2021, 2023 ప్రపంచకప్‌లకి భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. కాబట్టి.. ఆ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకి ఎలాంటి సమస్య లేకుండా బీసీసీఐ నుంచి హామీ పత్రాన్ని ఇప్పించాలని ఐసీసీని కోరాం. ముఖ్యంగా.. వీసాలకి సంబంధించిన క్లియరెన్స్’’ అని వెల్లడించాడు.

భారత్, పాకిస్థాన్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌‌లో మాత్రమే తలపడుతున్నాయి. అయితే.. 2018 ఆసియా కప్‌కి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. పాక్ జట్టుని ఇక్కడిని అనుమతించేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో టోర్నీని.. యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించాల్సి వచ్చింది. అయితే.. 2021, 2023లో వరల్డ్‌కప్‌ ఆతిథ్య వేదికని మార్చేందుకు భారత్‌ సిద్ధంగాలేనట్లు తెలుస్తోంది. దాంతో.. పీసీబీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.