యాప్నగరం

Telugu Titansకి మళ్లీ తప్పని నిరాశ.. పాయింట్ తేడాతో ఓటమి

ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఈరోజు పట్నా పైరేట్స్‌పై గెలిచేలా కనిపించినా.. చివర్లో తడబడే బలహీనతని అధిగమించలేకపోయింది.

Samayam Telugu 3 Jan 2022, 10:37 pm
ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. పట్నా పైరేట్స్‌తో బెంగళూరు వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 30-31 తేడాతో తెలుగు టైటాన్స్ పరాజయాన్ని చవిచూసింది. తెలుగు టైటాన్స్‌కి ఇది ఐదో మ్యాచ్‌కాగా.. మూడింట్లో ఓడి.. రెండింటిని టైగా ముగించింది. తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టు తెలుగు టైటాన్స్ కావడం గమనార్హం.
Samayam Telugu Patna Pirates, Telugu Titans (Pic Credit:  ProKabaddi/Twitter)


స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ గాయపడటంతో ఈరోజు మ్యాచ్‌లో అంకిత్ బాధ్యత తీసుకుని సూపర్-10తో సత్తాచాటాడు. కానీ.. అతనికి డిఫెన్స్ నుంచి పెద్దగా సపోర్ట్ లభించలేదు. కెప్టెన్ రోహిత్ కుమార్ మరోసారి తేలిపోగా.. డిఫెండర్ సురీందర్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. డిఫెండర్ రుతురాజ్ ఒక్కడే 4 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. మొత్తంగా.. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఒకసారి ఆలౌటైన తెలుగు టైటాన్స్ 13-18తో వెనకబడింది.

కానీ.. సెకండాఫ్‌లో మాత్రం తెలుగు టైటాన్స్ పుంజుకుంది. ఎంతలా అంటే పట్నా పైరేట్స్‌ని ఆలౌట్ చేయడంతో పాటు.. ఆ జట్టు కంటే మూడు ఎక్కువ రైడ్ పాయింట్లని కూడా సాధించింది. కానీ.. మ్యాచ్ చివర్లో తడబడే బలహీనతని అధిగమించలేక కొద్దిలో మ్యాచ్‌ని చేజార్చుకుంది. తెలుగు టైటాన్స్ తర్వాత మ్యాచ్‌ని దబాంగ్ ఢిల్లీతో బుధవారం రాత్రి ఆడనుంది. దబాంగ్ ఢిల్లీ ఇప్పటి వరకూ తాజా సీజన్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.