యాప్నగరం

రియో ముందు భారత్‌కు శరాఘాతం!

భారత్ పతకం సాధించే అవకాశం ఉన్న క్రీడాంశాల్లో రెజ్లింగ్ ఒకటి. అయితే భారత్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం అందరికీ షాకిచ్చింది..

TNN 24 Jul 2016, 11:56 am
మరి కొద్ది రోజుల్లో రియో ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ బయల్దేరాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ సంఘటన భారత అథ్లెట్లలో సంచలనానికి కారణమైంది. ప్రపంచ స్థాయి కుస్తీ పోటీల్లో కాంస్యం సాధించి, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఆయన డోపింగ్ పరీక్షల రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) డీజీ ప్రకటించారు. ఈ నెల 5న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోనేపట్ ప్రాంతీయ కార్యాలయంలో నర్సింగ్‌కు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆయన నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు ఈ పరీక్షల్లో తేలింది. శాంపిల్ బిలోనూ ఆయనకు వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చాయి. రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ పోటీ పడాల్సి ఉంది. డోపీగా తేలడంతో ఆయన ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు దాదాపు లేవని అధికారులు చెబుతున్నారు. భారత్ తరఫున రెజ్లింగ్‌లో పాల్గొనేందుకు ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ పట్టుబట్టాడు. నర్సింగ్‌తో పోటీ పెట్టి గెలిచినవారినే ఒలింపిక్స్‌కు పంపాలని డిమాండ్ చేశాడు. అయితే నిబంధనల ప్రకారం ప్రపంచ కుస్తీ పోటీల్లో పతకం సాధించిన నర్సింగ్‌కే అవకాశం ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్య, ఐఓసీ సభ్యులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.