యాప్నగరం

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ ఇకలేరు

భారత్‌కి 1948, 1952, 1956 ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు అందించిన హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ ఇక లేరు. గత ఏడాది 108 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఆరోగ్యంగా ఇంటికి వెళ్లిన బల్బీర్ ఈరోజు చనిపోయారు.

Samayam Telugu 25 May 2020, 9:13 am
భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ (95) అనారోగ్యంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఒలింపిక్స్‌లో మూడు సార్లు భారత్‌కి బంగారు పతకాలు అందించిన బల్బీర్ సింగ్‌ ఈరోజు మొహాలిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఈ నెల 8న ఆసుపత్రిలో చేరిన బల్బీర్ సింగ్‌‌ని గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే.. ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బల్బీర్ సింగ్ సీనియర్ అని అతడ్ని అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు.
Samayam Telugu Balbir Singh Sr


ఒలింపిక్స్‌లో బల్బీర్ సింగ్ 1952లో నెలకొల్పిన అత్యధిక గోల్స్ రికార్డ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బల్బీర్ ఐదు గోల్స్ చేయగా.. భారత్ 6-1తో ఘన విజయాన్ని అందుకుంది. అతని కెప్టెన్సీలో భారత్ జట్టు 1956 ఒలింపిక్స్‌లో ఏకంగా 38 గోల్స్ చేసి అరుదైన ఘనత సాధించింది. ఇక 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో ఇంగ్లాండ్‌పై ఫైనల్లో 4-0 తేడాతో భారత్ గెలవడం అప్పట్లో పెద్ద సంచలనం.

హాకీలో బల్బీర్ సింగ్ ఘనతలకి మెచ్చిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీతో గౌరవించింది. ఆ తర్వాత 2015లో మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో హాకీ ఇండియా సత్కరించగా .. 2012లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘‘ఇకానిక్ ఒలింపియన్స్’’ జాబితాలో చోటిచ్చింది. 16 మంది దిగ్గజాలకి స్థానం లభించిన ఈ ఇకానిక్ ఒలింపియన్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా అథ్లెట్‌గా బల్బీర్ సింగ్ నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.