యాప్నగరం

మారిన్‌పై విజయంతో రెండో స్థానానికి దూసుకెళ్లిన సింధు

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరువ అవుతోంది.

TNN 6 Apr 2017, 9:28 pm
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. గురువారం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సింధు రెండో స్థానంలో నిలిచింది. ఆమె కెరీర్లో ఇది అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇండియా ఓపెన్ ఫైనల్లో కరోలినా మారిన్‌పై అద్భుత విజయం సాధించి ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో తనను ఓడించిన మారిన్‌ను 21-19, 21-16 సింధు వరుస సెట్లలో ఓడించింది.
Samayam Telugu pv sindhus rise continues with career high no 2 ranking
మారిన్‌పై విజయంతో రెండో స్థానానికి దూసుకెళ్లిన సింధు


‘సింధు కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఆటలో మెరుగ్గా రాణించేందుకు సింధు నిరంతరం శ్రమిస్తుంటుంది. దేశ ప్రజల నుంచి కూడా ఆమెకి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తన ఎదుగుదలలో మీడియా సహకారం కూడా మరువలేనిది’ అని సింధు తండ్రి పి.వి.రమణ సంతోషం వ్యక్తం చేశారు. 2014లో టాప్ టెన్‌లోకి చేరుకున్న సింధు వేగంగా తన ర్యాంక్‌ను మెరుగు పర్చుకుంది. సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి, చైనా ఓపెన్ సూపర్ సిరీస్, మలేసియా మాస్టర్స్ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న సింధు.. హాంగ్ కాంగ్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది. ఐదేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం గెలవగా.. గతేడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించి దేశం దృష్టిని ఆకర్షించింది. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో వెండి పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.


భారత్ తరఫున బ్యాడ్మింటన్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఏకైక క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాత్రమే. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన స్పోర్ట్స్ అవార్డుల్లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన సింధు త్వరలోనే నంబర్ 1 స్థానానికి చేరుకోవాలని ఆశిద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.