యాప్నగరం

బోస్టన్ మారథాన్‌ను పూర్తిచేసిన భారత అంధ రన్నర్!

తాను గొప్ప క్రికెటర్ కావాలనుకున్నాడు.. రాబిన్ ఉతప్ప, స్టువర్ట్ బిన్నీ, మనీష్ పాండేతో పాటు ఇతర ప్రముఖ కర్ణాటక ఆటగాళ్లందరితో లీగ్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.. కానీ విధి అడ్డుకుంది.

TNN 20 Apr 2017, 11:22 pm
తాను గొప్ప క్రికెటర్ కావాలనుకున్నాడు.. రాబిన్ ఉతప్ప, స్టువర్ట్ బిన్నీ, మనీష్ పాండేతో పాటు ఇతర ప్రముఖ కర్ణాటక ఆటగాళ్లందరితో లీగ్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.. కానీ విధి అడ్డుకుంది. క్రికెటర్‌గా ఎదగాలనుకున్న సమయంలో కంటిచూపు రూపంలో తన ఆశయాన్ని చిదిమేసింది. కానీ అతను బయపడలేదు. క్రికెటర్‌ని కాలేకపోతే ఏం.. అథ్లెట్ అవుదామని అనుకున్నాడు. మనసులో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాడు. నేడు చారిత్రాత్మక బోస్టన్ మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా పూర్తిచేశాడు. ఇంతకీ ఆయన పేరేంటో తెలుసా.. సాగర్ బహేతి.
Samayam Telugu sagar baheti from playing cricket with karnatakas best to completing the boston marathon
బోస్టన్ మారథాన్‌ను పూర్తిచేసిన భారత అంధ రన్నర్!


వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఈ 31 ఏళ్ల మారథాన్ రన్నర్ 2013లో లక్షలో ఒకరికి వచ్చే స్టార్‌గార్ట్ అనే వింత వ్యాధితో తన కంటి చూపును కోల్పోయాడు. అయినప్పటికీ క్రీడలపై తనకున్న ఆసక్తి ఓ మారథాన్ రన్నర్‌ని చేసింది. బోస్టన్ మారథాన్‌లో పాల్గొన్న తొలి భారత అంధ అథ్లెట్‌గా చరిత్రలో నిలిపింది. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కి సాగర్ పెద్ద ఫ్యాన్. ఫెదరర్ ఒక్క మ్యాచ్‌ను కూడా సాగర్ మిస్ అయ్యేవాడు కాదు. సాగర్ చివరిగా 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్, నాదల్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను చూశాడు. ఆ తరవాత ఏ మ్యాచ్‌ను చూడలేకపోయాడు. కారణం ఆ తరవాత ఏడాదే సాగర్ తన కంటిచూపును కోల్పోవడం.

దీంతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సాగర్.. పూర్తిగా మారథాన్లపై దృష్టి పెట్టాడు. భారత్‌లోని అన్ని మారథాన్లలోనూ సాగర్ పాల్గొన్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పురాతనమైన, పెద్ద మారథాన్ అయిన బోస్టన్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తిచేసి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. మసాచుసెట్స్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ అండ్ విజువల్లీ ఇంపెయిర్డ్ (MABVI) స్వచ్ఛంద సంస్థ సహాయంతో అమెరికా వెళ్లిన సాగర్.. 30వేల రన్నర్లతో కలసి సోమవారం జరిగిన 121వ బోస్టన్ మారథాన్‌లో పాల్గొ్న్నాడు. సాగర్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు విష్ణుకాంత, నరేష్ బహేతి కూడా బోస్టన్ వెళ్లి తమ కుమారుడికి అండగా నిలిచారు.

సాగర్ ప్రస్తుతం బెంగళూరులోని విల్సన్ గార్డెన్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తు్న్నాడు. అలాగే కంటి చూపు కోల్పోయిన వారికి సహాయం చేస్తున్న సీఈజీఆర్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సాగర్ పనిచేస్తున్నాడు. కంటిచూపు లేని వారికి మసాచుసెట్స్ అసోసియేషన్ ఎంతగానో సహాయపడుతుందని, వారికి రూ. 6 లక్షలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాని ‘విజయ కర్ణాటక’కు సాగర్ వెల్లడించాడు. ‘నేను క్రికెట్ ఆడలేకపోవచ్చు, కానీ నేను పరిగెత్తగలను. నా శరీరం సహకరించినంత వరకు పరిగెడుతూనే ఉంటాను’ అని సాగర్ చెప్పారు. సాగర్ కేవలం తనకు 1 మీటర్ దూరంలో ఉన్న వస్తువులు, వ్యక్తులను మాత్రమే గుర్తించగలరు. ఎంతో దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న సాగర్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
Read this story in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.