యాప్నగరం

Twitter : బేరమాడేందుకు ఎలాన్ మస్క్ ప్లాన్‌! - ట్విట్టర్ డీల్‌లో మరో ట్విస్ట్

Elon Musk - Twitter Deal : ట్విట్టర్‌ డీల్‌లో ఎలాన్ మస్క్ మరో ట్విస్ట్ ఇచ్చారు. డీల్ కుదుర్చుకున్న దాని కంటే తక్కువ ధరకే సంస్థను అడుగుతాననేలా సంకేతాలు ఇచ్చారు. ఇందుకు కారణాన్ని కూడా వెల్లడించారు.

Authored byKrishna Prakash | Samayam Telugu 17 May 2022, 12:48 pm
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ (Twitter) ను 44బిలయన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్న స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరో ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఈ డీల్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మస్క్ ఇస్తున్న సంకేతాలు, ట్విట్టర్‌లో అంతర్గతంగా జరుగుతున్న అంశాలతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి రేకెత్తుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ షేర్ ధర కూడా పడిపోతోంది. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. మరో ట్విస్ట్ ఇచ్చారు.
Samayam Telugu బేరమాడేందుకు ఎలాన్ మస్క్ ప్లాన్‌!
Elon Musk Twitter


డీల్ కుదుర్చుకున్న దాని కంటే తక్కువ ధరకే ట్విట్టర్‌ను అప్పగించాలని ఆ సంస్థను అడుగుతానని ఎలాన్ మస్క్ చెప్పారు. కంపెనీ తనకు చెప్పిన దానికంటే ట్విట్టర్‌లో కనీసం నాలుగు రెట్లు అధికంగా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని భావిస్తున్నందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు మియోమీలో జరిగిన ఆన్‌ఇన్ సమిట్ 2022 కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. “వాళ్లు చెప్పినదాని కంటే చాలా అధ్వాన్నంగా ఉన్న దాని కోసం మీరు అదే ధరను చెల్లించలేరు” అని మస్క్ అన్నారు. అలాగే మరిన్ని ప్రశ్నలను సైతం అడుగుతానని చెప్పారు.

కాగా 44బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.41లక్షల కోట్లు) ట్విట్టర్ డీల్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉందని, స్పామ్ అకౌంట్లపై సమాచారం అందేందుకు ఆలస్యమవుతుండడమే ఇందుకు కారణమని మస్క్ ఇటీవల చెప్పారు. 5శాతం స్పామ్ అకౌంట్లు ఉన్నాయని ట్విట్టర్ అధికారికంగా చెబుతుండగా.. అయితే కనీసం 20శాతం ఉంటాయని తాను భావిస్తున్నానని అన్నారు.

అలాగే ట్విట్టర్ డీల్ ధర మారుతుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అది తోసిపుచ్చాల్సిన అంశం కాదు అని కాన్ఫరెన్స్‌లో మస్క్ చెప్పారు. అలాగే ట్విట్టర్‌పై తన ఆందోళనలు పెరుగుతున్నాయని, మరిన్ని ప్రశ్నలు అడుగుతానని చెప్పారు.

ఎలాన్ మస్క్ కామెంట్లతో ట్విట్టర్ షేర్ దాదాపు 8శాతం తగ్గి 37.39 డాలర్లు (సుమారు రూ.2,900) దగ్గరకు పడిపోయింది. ట్విట్టర్‌లో తనకు వాటా ఉందని ఏప్రిల్‌లో మస్క్ ప్రకటించినప్పటి ముందు రోజు విలువ కంటే ఇది తక్కువే. డీల్ తర్వాత భారీగా పెరిగిన ట్విట్టర్ షేర్ ధర.. డీల్‌పై ఎలాన్ మస్క్ అనుమానాలు లేవనెత్తుతుండడంతో మళ్లీ నేలచూపులు చూస్తోంది.

అయితే ట్విట్టర్‌లో గత నాలుగు క్వార్టర్స్‌గా స్పామ్ అకౌంట్లు 5శాతం కంటే తక్కువగానే ఉన్నాయని సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ (Parag Agarwal) ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్ల అంశాన్ని విమర్శిస్తూ మస్క్ చేసిన ట్వీట్‌కు ఆయన స్పందించారు. కాగా, అగర్వాల్ సమాధానానికి రిప్లైగా మస్క్ పాప్ (Poop) ఎమోజీని ఉంచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.