యాప్నగరం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ బాస్ సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ అవార్డులు - Padma Bhushan Award

భారతదేశంలో పుట్టి ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది.

Samayam Telugu 26 Jan 2022, 12:10 am
భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో, చైర్మన్ సత్య నాదెళ్ల (Satya Nadella), గూగుల్ - అల్ఫాబెట్ (Google) సీఈవో సుందర్ పిచాయ్‌ (Sundar Pichai)కు అరుదైన గౌరవం దక్కింది. టెక్ ప్రపంచానికి దార్శనికులుగా మారిన వీరిద్దరికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇండియాలో పుట్టి, ఇక్కడే చదువుకొని ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ముందుకు నడిపిస్తున్న టెక్ దిగ్గజాలు సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్‌కు భారత దేశ మూడో అత్యున్నత అవార్డును ప్రకటించింది. భారతరత్న, పద్మవిభూషణ్ తర్వాత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ (Padma Bhushan Award).
Samayam Telugu సుందర్ పిచాయ్ - సత్య నాదెళ్ల
Sundar Pichai Satya nadella


సత్య నాదెళ్ల ప్రస్థానం
1967 ఆగస్టు 19వ తేదీన సత్యనారాయణ నాదెళ్ల (సత్య నాదెళ్ల) హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తల్లి ప్రభావతి సంస్కృత ఉపాధ్యాయురాలు. తండ్రి నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్ అధికారి.

సత్యనాదెళ్ల.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతం అమెరికాలోని విస్కజిన్ - మిల్వాకీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. ఆ తర్వాత చికాగో యూనివర్సిటీకి చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.

1992లోనే మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆయన ఆ సంస్థలో కీలకమైన వ్యక్తిగా మారారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ప్రాజెక్టు క్లౌడ్ కంప్యూటింగ్‌ను అప్పట్లో ముందుండి నడిపించారు. పరిశోధన, అభివృద్ధి విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా సత్య నాదెళ్ల పని చేశారు. అలానే మైక్రోసాఫ్ట్‌లో ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు నాయకత్వం వహించి విజయాలు సాధించారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO Satya Nadella)గా ఆయన నియమితులై.. సంస్థను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే 2021లో సంస్థ చైర్మన్‌గానూ బాధ్యతలు చేపట్టారు సత్య నాదెళ్ల.

సుందర్ పిచాయ్ ప్రస్థానం
పిచాయ్ సుందర్‌రాజన్ (గూగుల్ హెడ్ సుందర్ పిచాయ్) 1972 మార్చి 10న మద్రాసు (ఇప్పుడు చెన్నై)లో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటాలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి స్టాండ్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మెటాలర్జికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీ వార్టన్ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

సుందర్ పిచాయ్ తొలుత మెక్‌కిన్సే అండ్ కో సంస్థలో కొంతకాలం మెటీరియల్స్ ఇంజినీర్‌గా పని చేశారు. ఆ తర్వాత 2004లో గూగుల్‍‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2015 ఆగస్టు 10న ఏకంగా గూగుల్ సీఈవో స్థాయికి చేరారు. ఆ తర్వాత 2017లో గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ (Alphabet) సీఈవోగానూ నియమితులయ్యారు.

టైమ్స్ సంవత్సరానికి ఒకసారి ప్రకటించే 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో పిచాయ్‌కు రెండుసార్లు (2016, 2020) స్థానం దక్కింది. దీన్ని బట్టి ప్రపంచ వ్యాప్తంగా సుందర్ పిచాయ్‌ను ఎంత మంది ఆదర్శంగా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. సుందర్ పిచాయ్‌కు క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలు అంటే చాలా ఇష్టం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.