యాప్నగరం

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్టేషన్‌లలో మరింత వేగంతో ఫ్రీ వైఫై!

RailTel - PM-WANI Wi-Fi Service : రైల్వే స్టేషన్‌లలో మరింత వేగంతో వైఫై సర్వీస్‌లు కల్పించేలా రైల్‌టెల్ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పీఎం-వాణి ఆధారిత వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పుడు 100 రైల్వేస్టేషన్‌లలో ఈ వైఫై సర్వీస్‌ను మొదలుపెట్టగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్నిస్టేషన్‌లకు విస్తరించేందుకు ప్లాన్‌ చేసినట్టు ప్రకటించింది.

Authored byKrishna Prakash | Samayam Telugu 10 May 2022, 5:59 pm
రైల్వే స్టేషన్‌లలో మరింత వేగంతో ఉచిత పబ్లిక్ వైఫై సేవలు అందించేందుకు రైల్‍‌టెల్ ( RailTel ) సిద్ధమైంది. ప్రధాన మంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్ఫేస్ ( Prime Minister Wi-Fi Access Network Interface - PM-WANI ) ఆధారంగా వేగవంతమైన వైఫై సర్వీస్‌లను ప్రారంభించింది. ఫస్ట్ ఫేజ్‌లో పీఎం వాణి (PM-WANI) ఆధారంగా దేశంలోని 100 రైల్వేస్టేషన్‌లలో వైఫై సేవలకు శ్రీకారం చుట్టుంది. వీటి పరిధిలో 2,384 వైఫై హాట్‌స్పాట్‌లు ఉన్నాయి. ఈ విషయాన్ని రైల్‌టెల్ మంగళవారం ప్రకటించింది.
Samayam Telugu రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
RailTel PM WANI Wifi Network


ప్రస్తుతం 22 రాష్ట్రాల్లోని ఏ1, ఏ కేటగిరీలకు చెందిన 71 రైల్వేస్టేషన్‌లలో PM-WANI వైఫై సేవలను రైల్‌టెల్ షురూ చేసింది. వీటితో పాటు ఇతర కేటగిరీలకు చెందిన 29 స్టేషన్‌లలోనూ ప్రారంభించింది. క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న 6,102 రైల్వే స్టేషన్‌లకు ఈ ఫాస్ట్ వైఫై సర్వీస్‌ను విస్తరించనున్నట్టు రైల్‌టెల్ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ పూర్తయ్యే లోగా ఈ పక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో Wi-DOT యాప్‌ ద్వారా కూడా PM-WANI వైఫై నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయవచ్చని రైల్‌టెల్ తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఉన్న రైల్‌వైర్ సర్వీస్ సెట్ ఐడైంటిఫయర్ ( SSID ) కూడా సాధారణంగానే పని చేస్తుంది. అయితే ఈ యాప్‌ ద్వారా అదనపు సదుపాయాలు లభిస్తాయి. ప్రతీసారి ఓటీపీ అవసరం లేకుండా ఒకేసారి కేవైసీని సమర్పిస్తే సరిపోతుందని రైల్‌టెల్ వెల్లడించింది. C-DOTతో కలిసి రైల్‌టెల్ ఈ యాప్‌ను డెవలప్ చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 6,102 రైల్వే స్టేషన్‌లలో ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్ వైఫై సేవలను అందిస్తోంది. ఇందుకోసం 17,792 వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసింది. వీటి సంఖ్యను ఇంకా పెంచుతోంది. ఇక ఇప్పుడు దశవారీగా అన్ని స్టేషన్‌లలోనూ PM-WANI ఆధారిత పబ్లిక్ వైఫై సేవలను విస్తరించనుంది. ఈ ఏడాది జూన్ 10 కల్లా 1,000, జూన్ 20 లోగా 3,000, జూన్ 30 కల్లా 6,102 స్టేషన్‌లలో PM-WANI వైఫై సర్వీస్‌లను అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్టు రైల్‌టెల్ (RailTel) స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని మారుమూల ప్రాంతాలకు కూడా అందించాలన్నదే రైల్‌టెల్ లక్ష్యమని ఆ సంస్థ సీఎండీ పునీత్ చావ్లా చెప్పారు. టెలికం శాఖతో కలిసి కొత్త టెక్నాలజీతో నేషనల్ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చేందుకు పని చేస్తున్నామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.