యాప్నగరం

Elon Musk - Twitter : అనుకున్నది సాధించిన ఎలాన్ మస్క్ - ట్విట్టర్‌ హస్తగతానికి సిద్ధం - డీల్ పూర్తి వివరాలివే

Elon Musk Twitter Deal : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను కైవసం చేసుకునేందుకు సర్వం సిద్ధమైంది. ఆయన ఆఫర్‌ను ట్విట్టర్ బోర్డు అంగీకరించింది. మొత్తంగా 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను ఆయన కొనుగోలు చేయనున్నారు. ఈ డీల్ పూర్తి వివరాలు ఇవే.

Authored byKrishna Prakash | Samayam Telugu 26 Apr 2022, 5:22 am
Twitter Accepts Elon Musk Offer : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అనుకున్నది సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ (Twitter) ఆయన కైవసం కానుంది. కొన్ని వారాలుగా జరుగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ.. మస్క్ ఆఫర్‌ను ట్విట్టర్ బోర్డు అంగీకరించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లిపోనుంది. చరిత్రలో ఒకానొక ప్రైవేట్ బిగ్గెస్ట్ డీల్‌గా ఇది నిలిచిపోనుంది. దీంతో పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా ఉన్న ట్విట్టర్ ఇక మస్క్ ఆధీనంలోని ప్రైవేట్ సంస్థగా మారనుంది. ఎలాన్ మస్క్ - ట్విట్టర్ డీల్ (Elon Musk - Twitter Deal) పూర్తి వివరాలు ఇవే.
Samayam Telugu Elon Musk - Twitter : అనుకున్నది సాధించిన ఎలాన్ మస్క్
Elon Musk Twitter accepted $44B Elon Musk offer


టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మొత్తంగా 44 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.3.29లక్షల కోట్లు) వెచ్చించి ట్విట్టర్‌ను దక్కించుకోనున్నారు. ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‍కు 54.2 డాలర్లను చెల్లించనున్నారు. ట్విట్టర్‌లో తనకు 9.2 శాతం వాటా ఉందని మస్క్ ప్రకటించినప్పుడు ఉన్న ట్విట్టర్ షేర్ ధర కంటే ఇది 36శాతం అధికం. మస్క్‌ అతిపెద్ద వాటాదారుడిగా ఉన్నారని తెలిశాక ట్విట్టర్ షేర్ ర్యాలీ అవుతూనే ఉంది.

ట్విట్టర్ తన ఆఫర్‌ను అంగీకరించాక Yess అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. సంయుక్త ప్రకటనను పోస్ట్ చేశారు. మరోసారి భావ ప్రకటన స్వేచ్ఛ విషయాన్ని ప్రస్తావించారు. దీని కోసం ట్విట్టర్‌లో తీసుకురానున్న మార్పులు, కొత్త ఫీచర్లు, ఓపెన్ సోర్స్ అల్గారిథమ్ తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి… భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో అది చాలా ముఖ్యమని, భవిష్యత్తులో దీని ప్రాధాన్యత చాలా ఉంటుందని మస్క్ అన్నారు.

అలాగే ట్విట్టర్‌ (Twitter) కు అపారమైన శక్తి ఉందని, కంపెనీతో కలిసి పని చేసేందుకు ముందుంటానని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ (Twitter CEO Parag Agarwal) సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. “ట్విట్టర్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. దీనికి చాలా ఔచిత్యం ఉంది. ఇది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుంది” అని పరాగ్ అభిప్రాయపడ్డారు.

కాగా ట్విట్టర్ - ఎలాన్ మస్క్ మధ్య ఈ క్యాష్ డీల్ ఈ సంవత్సరం చివరి కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎలాన్ మస్క్ చేతికి పూర్తిగా ట్విట్టర్‌ వెళ్లిపోనుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ చాలా పాపులర్. రాజకీయ నాయకులు, అన్ని రంగాలకు చెందిన సెలెబ్రెటీలు, ఐటీ దిగ్గజాల నుంచి కోట్లాది మంది ప్రజల వరకు నిత్యం ట్విట్టర్ వినియోగిస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎన్నో చర్చలు సాగుతుంటాయి.

ట్విట్టర్‌లో మస్క్ చాలా ఫేమస్. ఆయనకు ప్రస్తుతం 8.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన వ్యాపార ఆసక్తులు, క్రిప్టో కరెన్సీ, రాజకీయ అంశాలతో పాటు సాధారణ విషయాలపై అభిప్రాయాలను ట్విట్టర్‌లో తరచూ ఎలాన్ మస్క్ పంచుకుంటుంటారు. యూజర్ల అభిప్రాయాలను తెలుసుకునే వారు. ఇప్పుడు ఏకంగా ఆ ప్లాట్‌ఫామ్‌నే కైవసం చేసుకున్నారు.

ట్విట్టర్‌లో తనకు 9.2 శాతం వాటా ఉందని స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ (Space X CEO Elon Musk) ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించారు. ఆ తర్వాత ట్విట్టర్‌లో భావ ప్రకటన స్వేచ్ఛపై విమర్శలు చేశారు. రావాల్సిన మార్పుల గురించి కొన్ని పోల్స్ నిర్వహించారు. ఓ దశలో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అవసరం అనేలా మాట్లాడారు. ఆ తర్వాత అనూహ్యంగా ట్విట్టర్‌నే కైవసం చేసుకునేందుకు భారీ ఆఫర్‌ ఇచ్చారు. తొలుత ట్విట్టర్‌ బోర్డు నిరాకరించేటట్టు కనిపించినా.. మస్క్ దూకుడుకు తలొగ్గక తప్పలేదు. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన మస్క్.. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.