యాప్నగరం

దేశంలో ఈ డివైజ్‌లు వాడడం, అమ్మడం నిషేధం - అతిక్రమిస్తే చర్యలు!

Signal jammers, Mobile Signal boosters : భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ (Department of Telecommunications) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సిగ్నల్ జామర్లు, మొబైల్‌ సిగ్నల్ బూస్టర్ల వాడకం, అమ్మకం విషయంలో హెచ్చరికలు చేసింది. అవేంటో చూడండి.

Edited byKrishna Prakash | Samayam Telugu 4 Jul 2022, 9:33 pm
టెలికమ్యూనికేషన్స్ శాఖ ( Department of Telecommunications - DoT ) కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వైర్‌లెస్‌ జామర్స్ (Wireless Jammers), మొబైల్‌ సిగ్నల్ బూస్టర్లు/ రీపీటర్ల (Mobile Signal Boosters/Repeaters) వినియోగంపై పబ్లిక్ అడ్వయిజరీని విడుదల చేసింది. వైర్‌లెస్‌ జామర్లు, సిగ్నల్ జామర్లు, జీపీఎస్ బ్లాకర్లతో పాటు ఇతర సిగ్నల్ జామింగ్ డివైజ్‌లను వినియోగించడంపై నిషేధం విధించింది. ఒకవేళ వీటిని విక్రయిస్తే చట్టపరంగా శిక్ష పడుతుందని హెచ్చరించింది.
Samayam Telugu Jammers signal boosters


కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రాష్ట్ర, సెంట్రల్ పోలీస్ శాఖలు, రక్షణ దళాలు మాత్రమే సిగ్నల్ జామర్లను ఉత్పత్తి చేస్తాయని డాట్ తెలిపింది. ప్రైవేటు సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో జామర్లను తయారు చేయకూడదని, అమ్మకూడదని వెల్లడించింది. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఎవరూ వినియోగించకూడదని స్పష్టం చేసింది. జామర్లకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం, అమ్మడం, సరఫరా చేయడం కూడా ఇక నేరమేనని తెలిపింది. ఈ-కామర్స్ సైట్లు కూడా వీటిని వెంటనే తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదని పేర్కొంది.

సిగ్నల్ బూస్టర్ల విషయంలో..
సెల్‌ఫోన్ సిగ్నల్ బూస్టర్ల విషయంలోనూ టెలి కమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. సెల్ ఫోన్‌ సిగ్నల్స్‌ను మెరుగ్గా పొందేందుకు యాంప్లిఫయర్లు ఉన్న సిగ్నల్ బూస్టర్లు, రిపీటర్స్ వాడకంపై నిషేధం విధించింది. ఇలాంటి డివైజ్‌ల వాడకం వల్ల పబ్లిక్ టెలికమ్యూనికేషన్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని చెప్పింది. నెట్‌వర్క్‌ల క్వాలిటీ, కవరేజ్‌పై ఇవి ప్రభావాన్ని చూపుతున్నాయని పేర్కొంది. బూస్టర్లను ఎవరూ విక్రయించకూడదని, డిస్ట్రిబ్యూట్ చేయకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
కొందరు సిగ్నల్ బూస్టర్లు వాడుతుండడం వల్ల పోలీసులు, ఆసుపత్రులు లాంటి అత్యవసర సేవల కోసం కాల్ చేసే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. అందుకే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు.. సెల్‌ఫోన్ సిగ్నల్ బూస్టర్లను వాడడాన్ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. లైసెన్స్ కలిగిన టెలికం సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే సిగ్నల్ బూస్టర్లను వినియోగించవచ్చని తెలిపింది. చట్టవిరుద్ధంగా ఎవరైనా సిగ్నల్ బూస్టర్లను అమ్మినా, డిస్ట్రిబ్యూట్ చేసినా నేరమే అని డాట్ స్పష్టం చేసింది.

ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు ఈ నిబంధనలు అతిక్రమించి జామర్లు, మొబైల్ సిగ్నల్ బూస్టర్లు వాడడం ఇక నేరమని డాట్ వెల్లడించింది. వీటిని ఎవరైనా అమ్ముతున్నట్టు, వినియోగిస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.