యాప్నగరం

Basara: బాసర ఆలయానికి మహర్దశ.. యాదాద్రి తరహాలో అభివృద్ధి

Basara Temple: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి సరస్వతీ కొలువైన బాసర ఆలయానికి మహర్దశ. ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. యాదాద్రి తరహాలో ఆలయ నిర్మాణం చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 25 Mar 2023, 10:17 am

ప్రధానాంశాలు:

  • బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
  • శృంగేరి పీఠం ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్
  • యాదాద్రి తరహాలో ఆలయ అభివృద్ధి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Basara Temple
బాసర ఆలయం
Basara Temple Renovation: నిర్మల్‌ జిల్లాలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయంలో కుంకుమపూజ, మహాహారతి, చండీహోమం నిర్వహించారు. ఆలయం లోపల గర్భాలయ పునర్నిర్మాణానికి శిల వేసిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. యాదాద్రి తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆలయ పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటికే మంజూరు చేసిన నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం కృష్ణశిలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రాజగోపురాలు, ఆలయ మాడవీధులు, ప్రాకారాలు, కాటేజీలు, ఉద్యాన వనాలతో ఆలయ రూపురేఖలను మార్చేశారు. అదే తరహాలో బాసర ఆలయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కర్ణాటకలోని శృంగేరి పీఠాధిఫతుల అనుమతి తీసుకొని ఆగమశాస్త్రం ప్రకారం మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులు సమాయత్తమవుతున్నారు.

బాసరలో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లు ఆలయంలో కొలువై ఉన్నారు. గర్భగుడిలో మహా సరస్వతి విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి కొలువై ఉండగా.. పైఅంతస్తులో మహంకాళి విగ్రహం ఉంది. సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వాలని ఆగమ శాస్త్రం చెబుతోంది. అయితే ఇప్పుడు భక్తులు ప్రత్యేకంగా చూస్తే తప్ప మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కలగటం లేదు. అందువల్ల ఇప్పుడున్న ప్రాకార మండపాన్ని తొలగించి కొత్త మండపాన్ని నిర్మించేందుకు దేవాదాయ శాఖ ప్లాన్ సిద్ధం చేస్తోంది.

ప్రాకార మండపానికి తూర్పు, పశ్చిమ దిశల్లో ఏడు అంతస్తుల్లో రెండు రాజ గోపురాలు, ఉత్తర, దక్షిణ దిశల్లో 5 అంతస్తులతో మరో 2 రాజ గోపురాలు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడున్న ప్రాకార మండపం మరో 50 మీటర్లు ముందుకు జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో ఉన్న గర్భగుడి 25.5 అడుగుల వెడల్పు, 16.5 అడుగుల పొడవుతో నిర్మించనున్నారు. 6.5 అడుగుల వెడల్పున్న ఆలయ ముఖ ద్వారాన్ని 18.5 అడుగులకు పెంచేందుకు అధికారులు ఫ్లాన్ రెడీ చేస్తున్నారు.

ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 50 కోట్ల నిధులు మంజారు చేసింది. ఆ నిధుల్లో రూ. 8 కోట్లు వెచ్చించి ఇప్పటికే ఆలయ పరిసరాల్లోని విశ్రాంతి భవనాలు, తదితర పనులను చేపట్టారు. రూ. 22 కోట్లతో ఇప్పుడున్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు గోదావరి ఘాట్ల వద్ద సుందరీకరణ, క్యూ కాంప్లెక్సుల్లో డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, సాధారణ భక్తుల వసతి కోసం మరిన్ని గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.