యాప్నగరం

కిడ్నాపర్ల చెరలో కేసీఆర్ బంధువుల సమయస్ఫూర్తి.. తెలివిగా తప్పించుకున్నారిలా!

Bowenpally Kidnap Case | హైదరాబాద్‌లో కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసు సంచలనమైంది. ఈ కేసులో పోలీసులు అప్రమత్తయ్యేలోగా కిడ్నాపర్లు ముగ్గురు అన్నదమ్ములను లంగర్ హౌజ్ వద్ద వదిలి వెళ్లారు.

Samayam Telugu 6 Jan 2021, 8:42 am
హైదరాబాద్: కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ముగ్గురు అన్నదమ్ముల కిడ్నాప్‌తో పోలీసు శాఖ ఉలిక్కిపడగా.. భూ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. బోయిన్‌పల్లి మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావు అనే ముగ్గురు అన్నదమ్ములు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో కిడ్నాపయ్యారు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ దాదాపు పది మంది ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబీకుల దగ్గర్నుంచి ఫోన్లను తీసుకొని వారిని ఓ గదిలో ఉంచి.. డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, ఫోన్లు తీసుకున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ.. ముగ్గురు అన్నదమ్ములను వెంట తీసుకెళ్లారు.
Samayam Telugu bowenpally kidnap case


ఇంటికి బయటి నుంచి గడియ పెట్టి.. రెండు వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంట్లో వారు వాకబు చేయగా.. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఎవరూ సోదాలకు రాలేదని తెలిసింది. దీంతో వెంటనే బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలో సీసీ కెమెరాకు చిక్కిన వాహనం నెంబరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లో వారిని విచారించగా.. భూమా నాగిరెడ్డి వర్గంతో కొన్ని భూ వివాదాలు ఉన్నాయని.. ఇప్పటికే భూమి కోసం గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. భూవివాదం నడుస్తున్న వారితో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ మాజీ హాకీ ప్లేయర్ కావడంతోపాటు.. మహబూబ్‌నగర్ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కుటుంబం కావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

చివరకు లంగర్ హౌజ్ వద్ద కిడ్నాపర్లు ముగ్గుర్నీ వదిలి వెళ్లారు. తమతో పేపర్ల మీద సంతకం చేయించుకొని వదిలేశారని పోలీసుల విచారణలో బాధితులు తెలిపారు. ముందు జాగ్రత్తగా తమ సంతకాలకు బదులు వేరే సంతకాలు పెట్టామని వారు పోలీసులకు తెలిపారు. వారిని మీడియా కంటపడకుండా పోలీసులు ఇంటికి చేర్చారు. వందల కోట్ల రూపాయల విలువైన భూముల వ్యవహారంలో... కిడ్నాప్‌కు, బెదిరింపులకు గురైనప్పటికీ.. ముగ్గురు అన్నదమ్ములు సమయస్ఫూర్తితో వ్యవహరించారనే భావన వ్యక్తం అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.