యాప్నగరం

Cyber Fraud: సైబర్ కేటుగాళ్లు సీపీ మహేశ్ భగవత్‌ను కూడా వదల్లేదుగా..

Cyber Fraud: రోజురోజుకు సైబర్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. సైబర్ నేరగాళ్ల మోసాలకు కళ్లెం వేయలేకపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా.. అందరి పేర్లను వాడుకుని అందినకాడికి దోచుకునేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. చివరికి.. నేరగాళ్లను గడగడలాడించే పోలీసు ఉన్నతాధికారులను కూడా సైబర్ కేటుగాళ్లు వదలటం లేదు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఫొటో పెట్టి.. నకిలీ వాట్సప్ ఐడీ క్రియేట్ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 26 Sep 2022, 4:15 pm
Samayam Telugu Mahesh Bhagwat
రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌
Cyber Fraud: సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలట్లేదు. మొన్నటికి మొన్న పేరు మోసిన మిధాని సంస్థపైనే ఎటాక్ (Cyber Attack On Midhani Company) చేశారు. సంస్థ పేరుతో నకిలీ మెయిల్ ఏడీ (Fake Mail ID) క్రియేట్ చేసి 40 లక్షలు కాజేశారు. ఇలా రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు (Cyber Fraudsters).. నేరగాళ్లను గడగడలాడించే పోలీసు బాసును కూడా వదల్లేదు. ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ (Rachakonda CP Mahesh Bhagwat IPS) పేరు మీదే ఫేక్ వాట్సప్ ఐడీ (Fake Whatsapp Number) ని క్రియేట్ చేసి.. మోసాలకు తెరలేపారు. మహేశ్ భగవత్.. ఫోటో పెట్టి వాట్సప్ క్రియేట్ చేశారు. కమిషనర్ ఫొటోతో ఉన్న వాట్సప్ నెంబర్ నుంచి ప్రజలకు మెస్సేజ్‌లు చేస్తూ.. పైసలు అడుగుతున్నారు. ఈ విషయం వాళ్ల నోటా వీళ్ల నోటా పడి చివరికి సీపీకి తెలిసింది. ఏకంగా తన పేరు మీదే మోసాలు చేయటాన్ని చూసి మహేశ్ భగవత్ ఆశ్చర్యపోయారు.

సమాచారం తెలిసిన వెంటనే సీపీ మహేశ్ భగవత్ వెంటనే స్పందించారు. 8764747849 నెంబర్‌తో వచ్చే మెస్సేజ్‌లకు స్పందించకూడదని ప్రజలకు సూచించారు. తన ఫొటో, పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సప్ ఐడీ క్రియేట్ చేశారని.. వారి వలలో చిక్కి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ ఐడీ క్రియేట్ చేసిన సైబర్ నేరగాన్ని పట్టుకునేందుకు తమ బృందం పనిచేస్తోందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

ఇంతకు ముందు.. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రాం లాంటి వేదికలను వాడుకున్న సైబర్ కేటుగాళ్లు.. సామాన్యుల పేర్లు, ఫొటోలతో నకిలీ ఐడీలను క్రియేట్ చేసేవాళ్లు. మెడికల్ ఎమర్జెన్సీ అనో.. అర్జెంటుగా డబ్బులు కావాలనో.. ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవాళ్లందరికీ మెస్సెజ్‌లు పెట్టేవారు. అది నిజమని నమ్మి.. ఆపద సమయంలో ఆప్తులను ఆదుకోవాలన్న మానవత్వంతో ఆలోచించిన కొందరు తోచినంత నగదు సాయం చేసేవాళ్లు. ఇలా సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారు. కొందరు అలర్ట్‌గా ఉండి.. నేరగాళ్ల వలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు.. ఏకంగా నకిలీ వాట్సప్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసాలపై ప్రజలంతా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నగదు కావాలంటూ.. వచ్చిన మెస్సేజ్‌ల పట్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్పందించాలని పోలీసులు పదేపదే సూచిస్తున్నారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.