యాప్నగరం

UNESCO Awards: అరుదైన గౌరవం.. తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

Unesco Awards: తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గౌరవం దక్కింది. ​​​​​సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ కింద కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పరిధిలోని గోల్కొండ (golkonda) మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట (domakonda fort)లకు యునెస్కో (unesco) అవార్డులు లభించాయి. ఆసియా-పసిఫిక్‌ విభాగానికి సబంధించి మన దేశం నుంచి నాలుగు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. ఇక ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియంతో పాటు దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు అవార్డులు లభించాయి.

Authored byసందీప్ పూల | Samayam Telugu 28 Nov 2022, 8:49 am

ప్రధానాంశాలు:

  • తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు అరుదైన గౌరవం
  • యునెస్కో అవార్డులకు ఎంపికైన గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోట
  • ఆసియా-పసిఫిక్‌ విభాగంలో అవార్డులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu unesco awards
యునెస్కో అవార్డులు
Unesco Awards: తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో (unesco) అవార్డులు లభించాయి. ఆసియా-పసిఫిక్‌ విభాగానికి సబంధించి ఇండియా నుంచి నాలుగు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు ఎంగ్‌ టెంగ్‌ ఫాంగ్‌ చారిటబుల్‌ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలు ప్రకటించింది.
సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ కింద కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి (golkonda stairwell), కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట (domakonda fort) ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. గోల్కొండ మెట్లబావి 'అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్' కేటగిరీలో, దోమకొండ కోట 'అవార్డ్ ఆఫ్ మెరిట్' కేటగిరీలో అవార్డులు దక్కంచుకున్నాయి. ఇక ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియంకు 'అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లభించగా.., దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు 'అవార్డ్ ఆఫ్ మెరిట్' అవార్డులు లభించాయి.

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు అందగా చివరికి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్‌ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. మరో నాలుగు చైనాకు దక్కగా.., ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ దేశాలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం 'అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌' అవార్డు ముంబైలోని ఛత్రపతి 'శివాజీ మహారాజ్‌ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం'కు దక్కింది. రెండో కేటగిరీ డిస్టింక్షన్‌లో గోల్కొండ మెట్లబావి చోటు దక్కించుకుంది.

కుతుబ్‌షాహీల కాలంలో 17వ శతాబ్దంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఈ మెట్ల బావిని నిర్మించగా.. కాలక్రమంలో అది మరుగున పడిపోయింది. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలకు కొంత వరకు పూడుకుపోయింది. 2013లో ఈ బావి పునరుద్ధరణకు ఆగాఖాన్ ట్రస్ట్ ముందుకొచ్చింది. . ఆగాఖాన్‌ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది.

ఇక దోమకొండ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశస్తులు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో నిర్మించారు. కోట చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో కూడిన ప్రహరీ, దాని చుట్టూ కందకంతో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కోటలో అద్దాల మేడ, రాజభవనం, అశ్వశాల, బుర్జుజులతోపాటు 4 శతాబ్దాల క్రితం నిర్మించిన మహదేవ ఆలయం కూడా ఉంది. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఆర్కిటెక్ట్‌ అనురాధ నాయక్‌ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం 2012లో ఈ కోటలోనే జరిగింది.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.