యాప్నగరం

కొత్త సంవత్సరం.. హైదరాబాదీలకు కేటీఆర్ కొత్త గుడ్ న్యూస్

Hyderabad: ప్రగతి భవన్‌లో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి అధికారులతో ఒక సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.

Samayam Telugu 19 Dec 2020, 3:33 pm
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు చెల్లించకుండా ప్రజలకు నీటి సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన కసరత్తు ఇవాళ ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి అధికారులతో ఒక సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
Samayam Telugu కేటీఆర్ (ఫైల్ ఫోటో)
ktr


2021 నూతన సంవత్సర తొలి వారంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల నుంచి 20 వేల లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోబోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం కనెక్షన్లు, నీటి సరఫరాకి అవసరమైన ఏర్పాట్లు, ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన విధి విధాన రూపకల్పన పైన ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు.

ఈ ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రజలకు సంపూర్ణంగా సమర్థవంతంగా వెళ్లేలా జలమండలి చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా మంత్రి కేటీఆర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలందరికీ ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను పటిష్టంగా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను ఒకటి రెండు రోజుల్లో రూపొందించి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.