యాప్నగరం

Hyd: పండగకి ఊరెళ్తే వెళ్లారు.. కానీ ఆ పని వద్దు.! కమిషనర్ హెచ్చరిక

సంక్రాంతి పండుగకు ఊరెళ్తూ చేసే చిన్న పొరపాటు ఇబ్బందులను తీసుకురావొచ్చని.. అలాంటి పనులు చేయొద్దంటూ హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు.

Samayam Telugu 13 Jan 2021, 3:17 pm
హైదరాబాద్ మహానగరం సంక్రాంతి పండుగ వేళ బోసిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడూ ట్రాఫిక్‌తో కిటకిటలాడే రోడ్లు వాహనదారుల సందడి లేక వెలవెలబోతాయి. ఏపీ వాసులతో సహా తెలంగాణలోని జిల్లాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది పండగకు ఊరెళ్లేందుకు ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి పండుగను ఎంజాయ్ చేసేందుకు పల్లెటూళ్లకి పరుగుపెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ పండుగ సీజన్‌లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు నేరస్తులకు వరంగా మారతాయని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.
Samayam Telugu హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్
hyderabad police


సంక్రాంతికి ఇంటికి వెళ్తున్న వారికి జాగ్రత్తలు చెప్పారు సీపీ. తాము ఊరికి వెళ్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు. ఆ పోస్టులు దొంగల కళ్లలో పడితే ఇళ్లలో చోరీలు జరిగే అవకాశాలుంటాయని.. కోరి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఆయన సూచిస్తున్నారు. నిరంతరం గస్తీ కాస్తున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన.. ముందే నివారణ చర్యలు చేపడితే నేరాలు జరిగేందుకు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. అలాగే గ్రామాలకు వెళ్తున్నవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈస్ట్ జోన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న టోలీ చౌకీకి చెందిన అబ్దుల్ జాఫర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే జాఫర్ వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన సొత్తు 23 తులాల బంగారం, డైమండ్ హారంతో పాటు బైక్‌ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే కిషన్‌బాగ్‌కి చెందిన హబీబ్ అజమత్ సౌత్‌ జోన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.