తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే బోనాల పండగ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండగతో హైదరాబాద్లోని బస్తీలు, కాలనీలు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిపూజ నిర్వహించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. నేడు లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెలను తీసుకెళ్తారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా తరఫున మధ్యాహ్నం 12 గంటలకు లంగర్హౌస్ చౌరస్తాలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం లంగర్హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపుతో జాతర ప్రారంభం అవుతుంది. బుధవారం లంగర్హౌస్, గోల్కొండ ప్రాంతాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పర్యటించి ఏర్పాట్లు సమీక్షించారు. కరోనా అనంతరం పూర్తిస్థాయిలో గోల్కొండ బోనాల జాతర జరుగుతుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్ తెలిపారు.
నేటి నుంచి బోనాల పండగ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం
తెలంగాణలో బోనాల పండగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గోల్కొండ అమ్మవారికి తెలంగాణ బోనం సమర్పించనున్నారు.
ప్రధానాంశాలు:
- నేటి నుంచి తెలంగాణ బోనాలు ప్రారంభం
- గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం
- పట్టువస్త్రాలు సమర్పించనున్న తెలంగాణ మంత్రులు