యాప్నగరం

Fire Safety: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై భవనాల్లో!

Mahmood Ali: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులతో హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించేే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్లార్లను ఇతర వ్యాపారాలకు ఉపయోగిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 15 Sep 2022, 11:53 pm
సికింద్రాబాద్‌లో ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదం నింపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాణిజ్య సముదాయాల్లో ఉన్న సెల్లార్లను ఇతర వ్యాపారాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సెల్లార్లను వ్యాపార కార్యక్రమాలకు వినియోగించకుండా చూడాలని, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులను హోం మంత్రి మొహమూద్‌ అలీ ఆదేశించారు. హోం శాఖ కార్యదర్శి రవిగుప్తతో కలిసి జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులతో గురువారం (సెప్టెంబర్ 15) ఆయన సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu Secunderabad Fire Accident
హోం మంత్రి మహమూద్ అలీ


జంట నగరాల్లోని పలు వ్యాపార, వాణిజ్య భవనాల్లో సెల్లార్లను పార్కింగ్ కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు ఉల్లంఘించి సెల్లార్లను ఇతర వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారని వివరించారు. దీని వల్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించే భవనాల యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మొహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. నివాస భవనాల్లోనూ అగ్నిప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సికింద్రాబాద్‌ ఘటనలో సెల్లార్‌లో నిర్వహిస్తున్న బైక్ షోరూమ్ కారణంగానే అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పైన ఉన్న రూబీ హోటల్ లాడ్జీలోకి మంటలు విస్తరించడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరైన టూరిస్టులు కొంత మంది రెండో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. తీవ్రంగా గాయపడ్డారు. అధికారులతో కలిసి మంత్రి మొమహూద్ అలీ రెండు రోజుల కిందట ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.