యాప్నగరం

Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, బైకులు

Telangana Rains: హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం గంటపాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపించాయి. భారీ వరదతో నల్లకుంటలో బైకులు, కార్లు నాలాలో కొట్టుకుపోయాయి.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 Apr 2023, 8:34 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
  • నగరాన్ని ముంచెత్తిన వాన
  • కొట్టుకుపోయిన కార్లు, బైకులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Rains In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం గంట పాటు కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రాహదారులు జలమయమయ్యాయి. రోడ్లుపైకి భారీగా వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపేశారు. వర్షం ధాటికి వరద పోటెత్తటంతో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. కార్లు, బైకులు వరద నీటిలో గల్లంతయ్యాయి.
నగరంలో అత్యధికంగా హిమాయత్ నగర్‌లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంట పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి హిమాయత్ నగర్‌లోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్ నెంబర్ 13లోని ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. కాలనీలోని ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరుకుంది. విఎస్‌టీ నాగమయ్యకుంట వెళ్లే నాలా రిపేర్ ఉన్న కారణంగా భారీగా వర్షం నీరు పద్మ కాలనీని ముంచెత్తింది. ఉన్నట్లుంటి వరద నీరు ముంచెత్తటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రామ్ నగర్ పద్మకాలనీలో వరద బీభత్సం సృష్టించింది. వరద నీటి కారణంగా ఇంటి ముందు పార్కు చేసిన వాహనాలు కొట్టుకొచ్చాయి. నల్లకుంట హెరిటేజ్ వెనుకాల ఉన్న నాలాలోకి బైకులు కొట్టుకొచ్చాయి. నానాలో కొట్టుకుపోయిన కొన్ని టూ వీలర్స్‌ను స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. లింగంపల్లిలోనూ వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా కార్లు నీట మునిగాయి. పలు కాలనీల్లో కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక తార్నాక, లక్డీకపూల్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద భారీగా వరద నీరు చేరింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


చిన్నారిని మింగేసిన నాలా
హైదరాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయి ఓ 12 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళాసిగూడ ప్రాంతానికి చెందిన చిన్నారి మౌనిక తన అన్నతో కలిసి ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లింది. దివ్యాంగుడైన తన అన్న మ్యాన్‌హోల్‌లో చిక్కుకుపోగా.. అతడిని కాపాడిన మౌనిక ప్రమాదవశాత్తు కాలు జారి మ్యాన్‌హోల్‌లో పడిపోయింది.

కాసేపటి తర్వాత చిన్నారి మౌనిక పార్క్‌లైన్ వద్ద శవమై తేలింది. ఈ ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ స్పదించారు. చిన్నారి మృతి చాలా బాధకరమని వాపోయారు. మ్యాన్‌హోల్ మూసేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్‌హెంసీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి కుటుంబానికి జీహెచ్‌ఎంసీ తరపున రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.