యాప్నగరం

Abid Hasan Safrani: ‘జై హింద్’ నినాదం రూపకల్పన చేసింది మన హైదరాబాదీనే

Abid Hasan Safrani భారత స్వాతంత్రోద్యమ సమయంలో జై హింద్ నినాదం భారతీయులను ఉప్పొంగేలా చేసింది. ఈ నినాదాన్ని రూపకల్పన చేసింది హైదరాబాద్‌కు చెందిన జైనుల్ అబిదీన్ హసన్.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 15 Aug 2022, 10:58 am
భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) పేరిట సైన్యాన్ని ఏర్పాటు చేసిన బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసిన వైనాన్ని భారతీయులు ఇప్పటికీ తలుచుకుంటూ పులకించుపోతుంటారు. ఆయన పేరు చెప్పగానే ‘జై హింద్’ నినాదమే స్ఫూరణకు వస్తుంది. భారత సైనికులు ఒకరికొకరు ఎదురు పడినప్పుడు ‘జై హింద్’ అని పలకరించుకునేవారు. నేతాజీ కారణంగానే ఈ నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. జైహింద్ నినాదాన్ని ముందుగా ఇచ్చింది సుభాష్ చంద్ర బోస్ కాదు.. మన హైదరాబాద్‌కు చెందిన ఓ ముస్లిం వ్యక్తి. భాగ్యనగరానికి చెందిన జైనుల్ అబిదీన్ హసన్.. సుభాష్ చంద్రబోస్‌తో కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
Samayam Telugu Abid Hasan Safrani


హైదరాబాద్‌కు చెందిన అమీర్ హసన్, ఫక్రుల్ హాజియా బేగం దంపతులకు ఏప్రిల్ 11, 1911న జైనుల్ అబిదీన్ హసన్ జన్మించారు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న సమయంలో నేతాజీతో పరిచయం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిషర్లను దేశం నుంచి తరమికొట్టడానికి సుభాష్ చంద్రబోస్ జర్మనీ సాయం తీసుకోవాలని భావించాడు. అక్కడి భారత యుద్ధ ఖైదీలతో మాట్లాడి వారిలో ఉత్తేజం నింపాడు. సుభాష్ ప్రసంగం విన్న అబిదీన్ కూడా ఆయనతో చేతులు కలిపాడు. ఇండియాకు వచ్చేసి ఐఎన్ఏలో మేజర్‌గా పని చేసి బర్మా నుంచి భారత సైన్యాన్ని నడిపారు.

ఆ సమయంలోనే సైనికులు ఒకర్నొకరు పకలరించుకోవడానికి ఏదైనా పదం సూచించమని నేతాజీ అబిదీన్‌ను కోరగా ఆయన ముందుగా ‘హలో’ అనే పదాన్ని సూచించారు. అయితే కొత్తదనం కావాలని బోస్ కోరగా.. ‘జై హిందుస్తాన్ కీ’ అని ప్రతిపాదించారు. అది చాలా పొడవుగా అనిపించడంతో చివరికి ‘జై హింద్’గా కుదించారు. దీంతో ‘జై హింద్’ అనే నినాదం భారత స్వాతంత్య్ర ఉద్యమంలోకి చొచ్చుకుపోయి ఎవరినోట విన్నా అదే వినిపించేది. అబిదీన్ సేవలను గుర్తించిన జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత ఆయన్ని ఐఎఫ్ఎస్‌లో చేర్చి ఉన్నత పదవి కల్పించారు. పదవీ విరమణ తర్వాత ఆయన హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఓ ఫామ్‌హౌస్‌‌లో శేష జీవితాన్ని కొనసాగించి 1984లో కన్నుమూశారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.