యాప్నగరం

లోటస్‌పాండ్‌లో రెండోరోజు దీక్ష కొనసాగిస్తున్న షర్మిల

నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల లోటస్ పాండ్‌లో రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ఆమెకు ఉదయాన్నే వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

Samayam Telugu 16 Apr 2021, 7:53 am
తెలంగాణలోనిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద ఆమె గురువారం ఉదయం ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సాయంత్రం 5 గంటలకు సమయం ముగిసిందని, దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో లోటస్‌పాండ్‌లోనైనా దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా కాలినడకన బయలుదేరగా ఆమెను కార్యకర్తలు అనుసరించారు.
Samayam Telugu షర్మిలకు పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్


పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. షర్మిల అనుచరులు ఆందోళన చేయడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగా వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పెనుగులాటలో షర్మిల దుస్తులు స్వల్పంగా చిరిగగా.. చేతికి గాయమైంది. సొమ్మసిల్లి పడిపోయిన ఆమెను పోలీసులు తమ వాహనంలో లోటస్‌ పాండ్‌కు తరలించగా అక్కడే దీక్ష కొనసాగించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చందమామ లాంటి పిల్లలు మరణిస్తున్నారని బాధపడిపోయిన కేసీఆర్‌కు తన పాలనలోనే యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అని నిలదీశారు. అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏదో ఒక రోజు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.