యాప్నగరం

Huzurabad: టీఆర్‌ఎస్‌కి బిగ్ షాక్.. దళితుల తిరుగుబాటు, కేసీఆర్ శవయాత్ర

దళిత బంధు ఇవ్వకుంటే కేసీఆర్‌కి రాజకీయ సమాధి కట్టేది దళితులే. అంబేడ్కర్ వారసులం. మా దెబ్బ రుచి చూపిస్తాం. మా ఓటు రాజేందర్‌కేనంటూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితులు ఆందోళనకు దిగారు.

Samayam Telugu 20 Oct 2021, 8:17 pm
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దళిత బంధు పథకంతో ప్రత్యర్థులను మట్టికరిపించిన ఆనందం గులాబీ బాస్‌కి ఎక్కువ కాలం నిలవడం లేదు. దళిత బంధు పథకం కింద ఎంపిక చేసి నిధులు విడుదల చేయకపోవడం.. ఈలోపే ఎన్నికల కమిషన్ దళిత బంధు పథకం అమలును నిలిపివేయడంతో దళితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాలకు చెందిన దళితులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శవయాత్ర చేయడం సంచలనంగా మారింది.
Samayam Telugu కేసీఆర్ శవయాత్ర చేస్తున్న దళితులు
kcr


జమ్మికుంట మండలంలోని కొరపల్లి, ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామాల్లో దళిత బంధు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యకం చేస్తూ దళితులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి శవయాత్ర నిర్వహించారు. పాడె మోసుకొచ్చి నడిరోడ్డుపై కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత బంధు ఇవ్వకుండా ఈటల రాజేందర్‌పై నిందలు మోపుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పేరుతో మరోసారి కేసీఆర్ మోసం చేశారని ఆవేదన చెందారు.

దళిత బంధు అని చెప్పి పాస్‌బుక్కులు ఇచ్చారని.. వాటిని ఏం చేసుకోవాలని దళిత మహిళలు ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలనూ కేసీఆర్ నెరవేర్చలేదని.. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలు గాలికొదిలేశాడని మండిపడ్డారు. ఇప్పుడు ముఖం చూపించుకోలేక దళిత బంధు పేరుతో మరోసారి ముందుకొచ్చాడని విమర్శించారు. ఇచ్చేవాడైతే ఈ దొంగ మాటలు.. లంగ మాటలు ఎందుకంటూ పరుష పదజాలంతో దూషించారు. ఎన్నికలలోపే దళిత బంధు పైసలివ్వాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం గమనార్హం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.