యాప్నగరం

ఆషాడ మాసంలో కులాంతర వివాహం.. ‘జనతా గ్యారేజ్’ను తలపించేలా మంత్రి కొప్పుల ఈశ్వర్ స్టోరీ!

KCR వెన్నంటి నడిచిన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన కొప్పుల ఈశ్వర్.. సింగరేణి ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

Samayam Telugu 20 Jan 2021, 12:31 pm
Samayam Telugu koppula eshwar
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న నాయకుల్లో కొప్పుల ఈశ్వర్ ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకు 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. కరీంనగర్ జిల్లాలోని జూపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈశ్వర్.. డిగ్రీ పూర్తయ్యాక సింగరేణిలో చేరి 20 ఏళ్లపాటు ఉద్యోగం చేశారు. పెద్దల సమక్షంలో స్నేహలతను కులాంతర వివాహం చేసుకున్నారు.

కొప్పుల ఈశ్వర్ వామపక్ష భావజాలంతో ఉండేవారు. స్నేహలత తండ్రికి సైతం కమ్యూనిస్టు భావజాలం ఉండేది. వారిది నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతం. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఈశ్వర్, స్నేహలత దంపతులు ఆషాఢ మాసంలో కులాంతర వివాహం చేసుకున్నారు. స్నేహలత పుట్టగానే ఆమె తల్లి చనిపోయారు. ఒక ఎన్‌కౌంటర్‌లో స్నేహలత అనే ఆవిడ చనిపోయారని.. ఆమె పేరునే నా భార్యకు పెట్టానని ఈశ్వర్ చెప్పారు. స్నేహలత అసలు పేరు కోకిలా దేవి.

పెళ్లయిన కొత్తలో తామిద్దరం బోధన్‌లో జతగాడు సినిమా చూశామని ఈశ్వర్ దంపతులు చెప్పారు. ఇద్దరం మాట్లాడుకుంటూ చెరుకు తోటల నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లామన్నారు. ఇటీవల తాము జనతా గ్యారేజీ సినిమా చేశామని.. ఆ సినిమా చూస్తే మా హిస్టరీనే గుర్తొచ్చిందన్నారు.

కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం..
1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్.. 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్ వెంటే నడిచారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.. జైలుకు కూడా వెళ్లొచ్చారు. 2004లో మేడారం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవికి రాజీనామా చేశారు. 2008 ఉపఎన్నికలో గెలిచారు.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మేడారం స్థానం రద్దు కావడంతో.. 2009లో ధర్మపురి నుంచి పోటీ చేసి గెలిచారు. ఉద్యమం కోసం మళ్లీ రాజీనామా చేసి 2010లో గెలిచారు. 2014లో ధర్మపురి నుంచి విజయం సాధించారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిత్యం ప్రజల్లో ఉండే ఆయన.. రాష్ట్రంలో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన అతి కొద్ది మంది నాయకుల్లో ఈశ్వర్ ఒకరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.