యాప్నగరం

బెల్లంపల్లి: దంపతులను బలి తీసుకున్న కరోనా... మాటలకందని విషాదం

బెల్లంపల్లి పట్టణంలో దంపతులను కరోనా రక్కసి బలి తీసుకుంది. ఎంతో అన్యోన్యంగా జీవించిన వారికి ఒకరినొకరు కడసారి చూపునకు కూడా నోచుకోలేని స్థితి కల్పించింది.

Samayam Telugu 20 Apr 2021, 10:06 am
కరోనా మహమ్మారి ఎన్నో జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. పచ్చటి సంసారాలను నాశనం చేస్తూ మరణ శాసనాలు రాస్తోంది. ఈ కోవలోనే బెల్లంపల్లికి చెందిన దంపతులు కరోనా కాటుకు బలైన ఘటన తీవ్ర విషాదం నింపింది. భర్తకు కరోనా సోకి పరిస్థితి విషమంగా ఉండంటంతో భయపడి భార్య ఆత్మహత్య చేసుకోగా.. చివరికి భర్త ఆ రక్కసికి బలైయ్యాడు. ఆసుపత్రిలో భర్తను చూడలేని భార్య.. ఆమె చనిపోతే కడసారి చూపుకు నోచుకోని భర్త.. ఈ హృదయ విదారకర ఘటన కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి ఓ ఉదాహరణ మాత్రమే. వారం రోజుల వ్యవధిలో దంపతుల మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Samayam Telugu మొండయ్య, జలజ దంపతులు(ఫైల్ ఫోటో)


బెల్లంపల్లి పట్టణం హన్మాన్‌ బస్తీకి చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు సుద్దాల మొండయ్య(69)కు ఈ నెల ఐదో తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బెల్లంపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఏడో తేదీన భార్య జలజ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో మొండయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని టిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొవిడ్‌ సోకడంతో జలజ ఆసుపత్రికి వెళ్లి భర్త బాగోగులు చూసుకోలేని పరిస్థితి. భర్తకు ప్రాణహాని ఉంటుందని భావించి ఈ నెల 13న అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఈ సమయంలో భార్య మృతి చెందిందని తెలిసినా రాలేని దయనీయ పరిస్థితి మొండయ్యది. తండ్రి చికిత్స పొందుతుండగానే తల్లి బలవన్మరణానికి పాల్పడటం వారి పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే సోమవారం మొండయ్య చనిపోవడంతో కుమారులు, కుమార్తెలు తల్లడిల్లిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వృద్ధ దంపతులు బస్తీకి దూరం కావడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.