యాప్నగరం

రాముడు అయోధ్యలోనే పుట్టాడా? జర్మనీలోనా? టీఆర్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వొద్దని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరో నేత రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

Samayam Telugu 24 Jan 2021, 11:59 am
అయోధ్య రామమందిరం పేరుతో బీజేపీ నేతలు బిచ్చమెత్తుతున్నారని.. మందిర నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వొద్దంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మండిపడడంతో ఆయన నాలుక్కరుచుకుని క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన మరువక ముందే మరో టీఆర్‌ఎస్ నేత రాముడిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు ఈ దేశంలోనే పుట్టాడా? అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ram


కరీంనగర్‌లో జరిగిన రాజ్యాంగ రక్షణ సదస్సులో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయోధ్య రామమందిర నిర్మాణ కోసమంటూ చందాల దందా మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొద్దిరోజుల్లోనే జైశ్రీరామ్ జైభీమ్ నినాదాల మధ్య యుద్ధం జరగబోతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతటితో ఆగని ఆయన రాముడి పుట్టుకపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘అసలు అయోధ్య రాముడు ఎక్కడో పుట్టాడో తెలవదు. నేపాల్ ప్రధాని రాముడు తమ దగ్గరే పుట్టాడని అంటున్నారు. అసలు రాముడు భారతదేశంలోనే పుట్టాడా? నేపాల్‌లో పుట్టాడా? జర్మనీలో పుట్టాడో తేలాల్సి ఉంది’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మరో వివాదానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. పనిలో పనిగా బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గుళ్లు గోపురాలు అంటూ విమర్శలు చేయడం తగదన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.