కూతురి ప్రియుడి హత్యకు కుట్ర... బీహారీ గ్యాంగ్కు సుపారీ, ట్విస్ ఇచ్చిన పోలీసులు
పెళ్లయిన తన కూతురితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కాపురాన్ని నాశనం చేస్తున్నాడన్నా కోపంతో వ్యక్తి హత్యకు వేసిన కుట్రను పోలీసులు చేధించారు.
Samayam Telugu 5 May 2022, 4:53 pm
ప్రధానాంశాలు:
- బీహార్ సుపారీ గ్యాంగ్తో హత్యకు ప్లాన్
- వేములవాడలో హత్య కలకలం
- వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితుడు
అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఓ వ్యక్తి హత్యకు పన్నిన కుట్రను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీసులు భగ్నం చేశారు. హత్య చేసేందుకు రంగంలోకి దిగిన బీహారీ గ్యాంగ్ను పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కథనం మేరకు.. వేములవాడకు చెందిన నీలం శ్రీనివాస్కు ఓ కూతురు వివాహమైనప్పటికీ మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. దాని కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్.. తన కూతురి కాపురం చక్కదిద్దాలన్న ఉద్దేశంతో ఆమె ప్రియుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు ముత్తయ్యతో కలిసి బీహార్ గ్యాంగ్ని కలిశాడు. రాజ్ కుమార్, లిఖిందర్ సింగ్ అనే ఇద్దరు బిహారీ వ్యక్తులకు రూ.5లక్షల సుపారీ ఇచ్చి తన కూతురి ప్రియుడిని చంపాలని ఒప్పందం చేసుకున్నాడు. దీంతో రాజ్కుమార్, లిఖిందర్ సింగ్లు తమపని పూర్తి చేసేందుకు ఆయుధాలతో సిరిసిల్లకు చేరుకున్నారు. అయితే గురువారం సిరిసిల్లలో తనిఖీలు చేపట్టిన పోలీసులు వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. కారులో మారణాయుధాలు కనిపించడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర బయటపడింది. దీంతో పోలీసులు బీహారీ గ్యాంగ్తో పాటు శ్రీనివాస్, ముత్తయ్యను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఓ కారు, బైక్తో పాటు మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.