యాప్నగరం

Bhadrachalam Godavari: మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువగా గోదావరి నీటిమట్టం

Bhadrachalam Godavari: జులై నెలలో గోదావరికి వచ్చిన భారీ వరదలు భద్రాచలం, పరిసర ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి బయటపడుతున్న వారిని మరోసారి గోదావరి ప్రవాహం పెరుగుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.5 అడుగులకు చేరింది. మరో అడుగున్నర పెరిగితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 11 Aug 2022, 7:18 am

ప్రధానాంశాలు:

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి
  • గురువారం ఉదయానికి 51.5 అడుగులకు చేరిన నీటిమట్టం
  • మరో అడుగున్నర పెరిగే మూడో ప్రమాద హెచ్చరిక జారీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Godavari  River (File Photo)
గోదావరి ప్రవాహం (ఫైల్ ఫొటో)
Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.50 అడుగులకు చేరిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరిలో 13.43 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుండటంతో... భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు 50 అడుగులు ఉన్న వరద.. 24 గంటల్లోపే మరో అడుగున్నర పెరిగింది. వరద ప్రవాహం కూడా మరో లక్ష క్యూసెక్కులు పెరిగింది.
బుధవారం సాయంత్రం నుంచి గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. దీంతో అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాక్టర్లు, వైద్య సామాగ్రి, పునరావవాస కేంద్రాల సంసిద్ధత తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్,వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్ మరియు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీతో కలిసి కరకట్టపై నుంచి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు.

గోదావరి వరద ప్రవాహం ఇలాగే పెరిగితే.. నేటి సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా.. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారనే సంగతి తెలిసిందే.

గోదావరి నదికి ఏటా ఆగస్టు నెలలో వరదలు వస్తుంటాయి. కానీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది జులై నెలలోనే భారీ స్థాయిలో వరదలొచ్చాయి. రికార్డు స్థాయిలో భద్రాచలం వద్ద గోదావరి 71.3 అడుగులు దాటి ప్రవహించింది. దీంతో భద్రాచలం, పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ముంపునకు గురైన గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. మళ్లీ గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకు ముందు రెండు సందర్భాల్లో మాత్రమే భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులకుపైగా ప్రవహించింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.