యాప్నగరం

Aswaraopeta: అశ్వారావుపేట 'కారు'లో అసంతృప్తి సెగలు..!

Aswaraopeta: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అశ్వారావుపేటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి ప్రజలు ప్రతీ ఎన్నికలోనూ భిన్నమైన తీర్పునిస్తారు. ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే తీరుపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని.. సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 20 Sep 2022, 6:26 pm

ప్రధానాంశాలు:

  • అశ్వారావుపేట కారులో అసంతృప్తి సెగలు
  • ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుపై ఫిర్యాదులు
  • ఇటీవల పార్టీ మారిన తాటి వెంకటేశ్వర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu War between TRS Leaders
అశ్వారావుపేట టీఆర్ఎస్‌లో వర్గపోరు
Aswaraopeta: ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. మళ్లీ తామే గెలిచేలా నేతలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి ఖమ్మం (Khammam) జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అందుకే మంత్రి కేటీఆర్ స్వయంగా ఖమ్మంపై ఫోకస్ పెట్టారు. వేరే నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా.. అశ్వారావుపేట మాత్రం టీఆర్ఎస్ (TRS) పార్టీకి తలనొప్పిగా మారింది. అక్కడి ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలో గుర్రుగా ఉన్నారు. ఆయన తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా.. టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర రావు (Mecha Nageswara Rao) చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మెచ్చా కూడా కారెక్కారు. అప్పటి నుంచి మెచ్చా, తాటి మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఇరు వర్గాల నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. ఆ వర్గపోరు కాస్త.. పార్టీలు మారే వరకు వెళ్లింది.

తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని.. తాటి వెంకటేశ్వర్లు (thati Venkateswarlu) చాలాసార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో.. తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. అప్పటితో సమస్య పరిష్కారం అయ్యిందని అంతా భావించారు. సమస్య పరిష్కారం కాకపోగా.. కొత్త ప్రాబ్లం వచ్చిపడింది. ఈసారి ఏకంగా నాయకులు, కార్యకర్తలు మెచ్చాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమకు కాకుండా.. టీడీపీ (TDP) కార్యకర్తలకు మెచ్చా నాగేశ్వర రావు ప్రాధాన్యత ఇస్తున్నారని.. గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఏ సమస్యలు చెప్పుకుందామన్నా.. మెచ్చా తమకు అందుబాటులో ఉండరని అంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే.. రాబోయే ఎన్నికల్లో నష్టం తప్పదని స్పష్టం చేస్తున్నారు. అయితే.. మెచ్చా (Mecha Nageswara Rao) మాత్రం ఇలాంటి కామెంట్స్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. ఎవరేం చేసినా.. మళ్లీ గెలుపు తనదేనని స్పష్టం చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.